ఈసారి విదేశీ అతిధుల్లేకుండానే రిపబ్లిక్ డే- బోరిస్ జాన్సన్ దూరం- 1966 తర్వాత ఇదే
భారత్లో స్వాతంత్రం వచ్చాక నిర్వహిస్తున్న గణతంత్ర దిన వేడుకలకు ప్రతీ ఏటా ఎవరో ఒక విదేశీ అతిధిని పిలవడం ఆనవాయితీగా వస్తోంది. విదేశీ అతిధుల రాకతో భారతీయ సంస్కృతీ సంప్రదాయాల గొప్పదనం వారికి తెలియజేయడమే కాకుండా దౌత్య సంబంధాలూ మెరుగుపర్చుకోవడం దీని వెనుక ఉన్న లక్ష్యం. కానీ ఈసారి ఏ విదేశీ అతిధి లేకుండానే రిపబ్లిక్ డే వేడుకలు జరగబోతున్నాయి.
ఈ ఏడాది కరోనా ప్రభావం తగ్గడంతో పలు జాగ్రత్తలు తీసుకుని గణతంత్ర దినోత్సవం నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. గతంతో పోలిస్తే పరిమిత సంఖ్యలోనే జవాన్లతో పాటు ఇతర అధికారులు, సిబ్బంది సేవలను వినియోగించుకుంటోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా రిపబ్లిక్ డే పరేడ్ రిహార్సల్ కోసం వచ్చిన జవాన్లలో దాదాపు 200 మంది వరకూ కరోనా సోకింది. దీంతో వీరిని ఐసోలేషన్కు పంపేశారు. మరోవైపు ఈ ఏడాది గణతంత్ర వేడుకలకు విదేశీ అతిధిగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ను కేంద్రం ఆహ్వానించింది. కానీ ఆయన కూడా రాలేనని చెప్పేయడంతో ఈ ఏడాది వేడుకలు విదేశీ అతిధి లేకుండానే నిర్వహించబోతున్నారు.
బ్రిటన్లో తాజాగా బయటపడిన కొత్త స్ట్రెయిన్ కలకలం రేపుతోంది. కొత్త స్ట్రెయిన్ ప్రభావంతో అక్కడ మరోసారి లాక్డౌన్ కూడా విధించారు. అలాగే కొత్త స్ట్రెయిన్ భయంతో బ్రిటన్ నుంచి వచ్చే విమానాలను భారత్ రద్దు చేసింది. ఇలాంటి పరిస్దితుల్లో సొంత దేశంలో జనం కరోనాతో అల్లాడుతుంటే భారత్ పర్యటనకు వెళ్లడంపై విమర్శలు వస్తాయన్న భయంతో బోరిస్ జాన్సన్ ఈ నెల 5వ తేదీనే తాను రాలేనంటూ ప్రధాని మోడీకి ఫోన్ చేసి చెప్పేశారు. దీంతో మరో అతిధిని పిలుస్తారనే ప్రచారం జరిగింది. కానీ దీనికి కూడా తెరదింపుతూ ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకలకు ఎవరినీ ఆహ్వానించడం లేదని విదేశీ వ్యవహారాలశాఖ ప్రకటించింది. 1950లో ఇండోనేషియా అధ్యక్షుడు సుకర్నో తొలిసారి భారత గణతంత్ర వేడుకల్లో విదేశీ అతిధిగా పాల్గొన్నారు. ఆ తర్వాత 1952 1953, 1966లో వివిధ పరిస్ధితుల కారణంగా విదేశీ అతిధులు హాజరు కాలేదు.