ప్రయాణికులకు షాకిచ్చిన రైల్వే శాఖ: ఇక ఫ్రీ ఇన్స్యూరెన్స్ లేదు
న్యూఢిల్లీ: రైలు ప్రయాణీకులకు రైల్వేశాఖ భారీ షాక్ ఇచ్చింది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటిసి) ద్వారా ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులకు అందించే ఉచిత బీమా సౌకర్యాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఉచిత బీమాను రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది. డిజిటల్ లావాదేవీలకు ప్రోత్సహమిచ్చే చర్యల్లో భాగంగా కేంద్రం చేపట్టిన ఉచిత బీమా సౌకర్యాన్ని త్వరలో నిలిపివేస్తున్నట్టు తాజా ప్రకటనలో తెలిపింది.
రైల్వేలు సెప్టెంబర్ 1నుంచి ప్రయాణీకులకు ఉచితంగా ప్రయాణ బీమాను నిలిపివేయనుందనీ.. 'బీమా ఐచ్ఛికం' అని సీనియర్ రైల్వే మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు చెప్పారు. రైల్వే ప్రయాణికులు వెబ్సైట్ లేదా మొబైల్ అప్లికేషన్ ద్వారా టిక్కెట్లు బుకింగ్ చేసుకుంటే ఇన్సూరెన్స్ కావాలా వద్దా అనే రెండు ఆప్షన్లను అందుబాటులో ఉంచినట్టు తెలిపారు.
అయితే ఇన్సూరెన్స్కు ఎంత చెల్లించాలనేది మాత్రం స్పష్టం చేయలేదు. కాగా, 2017,డిసెంబరు నుంచి ఆన్లైన్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ఐఆర్సిటిసిద్వారా రైల్వేశాఖ ఈ ఉచిత బీమాను తీసుకొచ్చింది. ఈ బీమా చేయించుకోవడం వల్ల రైలు ప్రమాదాలు లేదా ఇతర సంఘటనల్లో గాయపడినవారు లేదా చనిపోయినవారి కుటుంబీకులకు పరిహారం అందిస్తారు.
రైలు ప్రయాణం సమయంలో ఒక వ్యక్తి మరణించినప్పుడు గరిష్టంగా 10 లక్షల రూపాయలు, వికలాంగుడయితే 7.5 లక్షల రూపాయలు, గాయపడినట్లయితే రూ. 2 లక్షలు అందిస్తోంది. అలాగే మృతదేహాలను తరలించేందుకు రూ. 10వేలు కూడా అందిస్తుంది.