బంగ్లాలను ఖాళీ చేయండి: మాజీ సీఎంలకు సుప్రీం షాక్
న్యూఢిల్లీ: మాజీ ముఖ్యమంత్రులకు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. మాజీ ముఖ్యమంత్రులకు దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వ భవనాలను కేటాయింపునకు సంబంధించి సుప్రీం కోర్టు సోమవారం సంచలన తీర్పు వెలువరించింది. దేశంలోని పలు రాష్ట్రాలకు సీఎంలుగా పనిచేసి ప్రస్తుతం మాజీలుగా మారిన నేతలకు ఢిల్లీలో ప్రభుత్వ భవనాలను కేటాయించరాని ఆదేశాలు జారీ చేసింది.
అటువంటి వారు ఎవరైనా ఢిల్లీలో ఉంటే రెండు నెలల్లో ఖాళీ చేయాలని సర్వోన్నత న్యాయస్థానం తన ఆదేశాల్లో పేర్కొంది. వీవీఐపీల పేరిట ప్రభుత్వం వసతులను అనుభవిస్తున్న ఆయా మాజీ ముఖ్యమంత్రులు ప్రభుత్వ వసతి సదుపాయాలు వదులుకోవాల్సిందేనని తేల్చి చెప్పింది.
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు ములాయం సింగ్ యాదవ్, మాయావతి సహా ఆరుగురు ప్రభుత్వ నివాసాలను ఖాళీ చేయాలని ఆదేశించింది. లోక్ ప్రహారి అనే ఎన్జీఓ సంస్ధ పైల్ చేసిన పిటిషన్ను విచారించిన సుప్రీం కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
మాజీ ముఖ్యమంత్రులకు దేశ రాజధాని ఢిల్లీలో బంగ్లాల కేటాయింపులో నిబంధనలను అతిక్రమిస్తున్నారంటూ తన పిటిషన్లో పేర్కొంది. రెండు సంవత్సరాల క్రితం ఢిల్లీలోని పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్ మాజీ ముఖ్యమంత్రులు ఢిల్లీలోని బంగ్లాలను ఖాళీ చేయాలంటూ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
అయినప్పటికీ మాజీలు ఆ బంగ్లాలను ఖాళీ చేయకపోవడం విశేషం. తాజాగా తమకు కేటాయించిన ప్రభుత్వ భవనాలను ఖాళీ చేయకుండా వాటిలోనే తిష్ట వేసుకుని కూర్చున్న నేతలకు సుప్రీంకోర్టు ఆదేశాలు శరాఘాతంగానే పరిణమించనున్నాయనే వాదన వినిపిస్తోంది.