బోడో ఒప్పందం చారిత్రాత్మకం.. ఏ ప్రభుత్వం ముట్టే ధైర్యం చేయలేదు: ప్రధాని మోడీ
కోక్రాఝర్ / అస్సాం: పార్లమెంటులో భారత పౌరసత్వ సవరణ చట్టం పాస్ అయి చట్టంగా రూపు దాల్చిన తర్వాత తొలిసారిగా అస్సాం పర్యటనకు వచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ. అస్సాంలో శాంతిమంత్రం కోసమే ఆలోచించి చారిత్రాత్మక బోడో ఒప్పందం కుదుర్చుకున్నామని ప్రధాని మోడీ చెప్పారు. కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రాంతం హింస, ఘర్షణలతో అట్టుడికిపోయిందని చెప్పారు. అంతేకాదు కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. అయితే ఈ సమస్యలను గత ప్రభుత్వాలు పరిష్కరించడంలో విఫలమయ్యాయని మోడీ చెప్పారు. తమ ప్రభుత్వమే ఈ కార్యక్రమానికి పూనుకుందని వివరించారు.
Recommended Video
గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో ఈశాన్య రాష్ట్రాలే ఎక్కువగా నష్టపోయాయని చెప్పారు. కోక్రఝార్లో పర్యటించిన ప్రధాని మోడీ బోడో ఒప్పందం జరగడం ఒక వేడుకలా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. బోడో స్టూడెంట్స్ యూనియన్కు చెందిన యువత ఒప్పందంకు సహకరించడాన్ని ప్రధాని అభినందించారు. ఈ ఒప్పందం కార్యరూపం దాల్చడంలో కృషి చేసిన నేషనల్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్, బీటీసీ చీఫ్ హగ్రామ మొహిలారీతో పాటు అస్సాం ప్రభుత్వంకు ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. బోడో ఒప్పందం కుదరడంతో దశాబ్దాలుగా ఉన్న సమస్య అంతమవుతుందని చెప్పారు. ఈ ప్రాంతం ఇకపై అభివృద్ధి బాటలో పయనిస్తుందని వెల్లడించారు.
అస్సాంలోని బోడో డామినేట్ ప్రాంతంలో శాంతి నెలకొనాలనే ఉద్దేశంతో జనవరి 27న కేంద్ర ప్రభుత్వం నేషనల్ డెమొక్రాటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్, ఆల్ బోడో స్టూడెంట్స్ యూనియన్ మరియు పౌరసమాజ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా ఎన్డీఎఫ్బీకి చెందిన 1615 మంది ఆయుధాలను సరెండర్ చేశారు. ఒప్పందం జరిగాక రెండురోజుల్లో జనజీవన స్రవంతిలో కలిశారు. ఇదిలా ఉంటే 1993 మరియు 2003లో జరిగిన బీటీఏడీ శాంతి ఒప్పందం పెద్దగా పనిచేయలేదని ప్రధాని మోడీ గుర్తు చేశారు.
ఈశాన్య రాష్ట్రాల పట్ల గత ప్రభుత్వాల్లా కాకుండా తమ ప్రభుత్వం ఎంతో ప్రేమ చూపుతోందన్నారు ప్రధాని మోడీ. ఒకప్పుడు కేంద్రం ఎలాంటి నిధులు ఇస్తుందో అని ఈశాన్య రాష్ట్రాలు ఎదురు చూసేవని .. కానీ ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలు దేశాభివృద్ధిలో కీలకంగా మారాయని అన్నారు. ఇక శాంతియుత వాతావరణం కోసం కృషి చేయాలని ఇకపై ఇక్కడ హింసకు తావులేకుండా చేయాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు.