ద్వేషం లేదు, ఆగ్రహం లేదు, ప్రేమే ఉంది : పుణె విద్యార్థులతో రాహుల్
పుణె : ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ తనదైనశైలిలో ముందుకెళ్తున్నారు. తన ప్రత్యర్థి, ప్రధాని మోదీపై తనకెలాంటి ద్వేషం లేదని మరోసారి స్పష్టంచేశారు. ఆయన శుక్రవారం పుణెలో విద్యార్థులతో ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు.
ఐ లవ్ మోదీ
సత్యం ఆధారంగా పనిచేస్తానని పేర్కొన్నారు రాహుల్. దాని నుంచే మానవత్వం పుట్టుకొస్తోంది. మానవత్వం నుంచే ధైర్యం వస్తోంది. బలహీనవర్గాలైన రైతుల తరఫున నిలబడతాను అని స్పష్టంచేశారు. కనీస ఆదాయ భరోసా పథకంలో భాగంగా పేదవారికి రూ.72 వేలు ఇస్తామని హామీనిచ్చారు. నాకు మోదీపై ఎలాంటి ద్వేషం లేదు, ఐ లవ్ మోదీ అని ఉద్ఘాటించారు రాహుల్.
ఉద్యోగాల కల్పనేదీ ?
దేశం ప్రతిరోజు 27 వేల ఉద్యోగాలు రాకుండా కోల్పోతుంది. అనిల్ అంబానీ మెహుల్ చోక్సీ వంటి వారి ప్రయోజనాల కోసమే మోదీ సర్కార్ పనిచేస్తోందని విమర్శించారు. ఈ ఐదేళ్లలో మోదీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ? ఇప్పటివరకు ఎంతమంది రైతుల రుణాలు మాఫీ చేశారని ప్రశ్నించారు. బ్యాంకులపై అజమాయిషీ చేసి కొందరు లబ్ధిపొందారు. తిరిగి ఆ డబ్బును ఇవ్వలేదని గుర్తుచేశారు. ఆ నగదును ప్రజలకు అందేలా చేస్తే .. మన ఆర్థిక స్థితి పురోగమిస్తోందని విద్యార్థులకు తెలిపారు.
రిజర్వేషన్లు పక్కా ?
కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే పార్లమెంట్, విధానసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇస్తామని పేర్కొన్నారు. దీంతోపాటు ఉద్యోగాల్లో కూడా 33 శాతం కోటా వచ్చేలా రిజర్వేషన్లు కల్పిస్తామని పేర్కొన్నారు. పెద్దనోట్ల రద్దు పిచ్చి చర్య అని, ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాలు చూపిందన్నారు. న్యాయ్ పథకం అమలు చేస్తే ఉద్యోగాల కల్పన సృష్టించొచ్చని తెలిపారు.
రాజకీయమా ?
బాలాకోట్ ఉగ్ర శిబిరాలపై దాడులు వైమానిక దళం గొప్పదని చెప్పారు రాహుల్. కానీ దానిని కూడా రాజకీయం చేయడాన్ని తప్పుపట్టారు. సైనికులు చేసిన దాడులను తమకు అనుకూలంగా మార్చుకోవాలని మోదీ అనుకోవడం సరికాదన్నారు. రాజకీయ నాయకుల వద్ద జవాబుదారీతనం ఉండాలి, ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం నాకు ఉందన్నారు. ప్రధాని మోదీ ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారని ప్రశ్నించారు. మోదీపై నాకు ద్వేషం, ఆగ్రహం లేదు .. కేవలం ప్రేమ మాత్రమే ఉందన్నారు రాహుల్.