శివసేన అత్యవసర అభ్యర్థనకు ‘నో’: 13నే సుప్రీంకోర్టు విచారణ
న్యూఢిల్లీ: అత్యవసరంగా మంగళవారం రోజే సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసే వీలు లేదని, శివసేన అభ్యర్థనపై బుధవారం ఉదయం విచారణ జరుగుతుందని ఆ పార్టీ న్యాయవాదికి అత్యున్నత న్యాయస్థానం రిజిస్ట్రీ స్పష్టం చేశారు.
మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తగిన సమయం ఇవ్వలేదని, రాష్ట్రపతి పాలన విధించడంపై శివసేన సుప్రీంకోర్టును శివసేన ఆశ్రయించిన విషయం తెలిసిందే. మూడు రోజులపాటు సమయం కావాలని, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి మద్దతు ఇస్తున్నట్లు లేఖ తెస్తామని చెప్పినా గవర్నర్ వినలేదని పేర్కొంది.
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీకి 48 గంటల సమయం ఇచ్చారని, తమకు మాత్రం 24గంటలు మాత్రమే ఇచ్చారని శివసేన తెలిపింది. తమకు 48 గంటల కావాలని కోరితే గవర్నర్ అందుకు తిరస్కరించారని పేర్కొంది.
తాము చెప్పిన విషయాన్ని కోర్టు ముందు బుధవారం ఉదయం ఉంచుతామని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ చెప్పారని శివసేన తరపు న్యాయవాది సునీల్ ఫెర్నండేజ్ తెలిపారు. అత్యవసర విచారణ కుదరదని చెప్పినట్లు తెలిపారు. రాష్ట్రపతి పాలన విధించడంపై తాజాగా పిటిషన్ వేస్తున్నామని, దానిపైనా బుధవారం సుప్రీంకోర్టు విచారించనుందని తెలిపినట్లు చెప్పారు.
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన: మనుగడ లేని అసెంబ్లీ, అప్పటి వరకు అంతే..
కాగా, మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి సిఫార్సుల మేరకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని నిర్ణయించారు. కాగా, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వర్గాల సమాచారం ప్రకారం.. మహారాష్ట్రలో ఆరు నెలలపాటు రాష్ట్రపతి పాలన కొనసాగనుంది.
ఏదైనా పార్టీ అసెంబ్లీలో మెజార్టీ నిరూపించుకుంటే మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అప్పుడు రాష్ట్రపతి పాలనను ఎత్తివేయడం జరుగుతుంది. ఈ సమయంలో మహారాష్ట్రలో స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదని గవర్నర్ వివరించారని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు.
గవర్నర్ నివేదికపై కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసిందని, ఆ తర్వాత మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారని వెల్లడించారు. రాష్ట్రపతి పాలనతో మహారాష్ట్ర అసెంబ్లీకి మనుగడ ఉండదని స్పష్టం చేశారు.