అయ్యో..! పది సంవత్సరాలుగా పెరగని అంబానీ జీతం... అసలు జీతం ఎంతంటే..?
Recommended Video
ఈ మధ్యే ప్రపంచంలోని ధనికుల జాబితాను ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ బ్లూంబర్గ్ విడుదల చేసింది. తొలిస్థానంలో అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ నిలువగా తర్వాతి స్థానంలో బెర్నార్ట్ అర్నాల్ట్ మూడో స్థానంను బిల్గేట్స్ దక్కించుకున్నారు. ఇక భారతీయుల్లో 13వ స్థానంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ నిలిచారు. అయితే ముఖేష్ అంబానీ జీతం మాత్రం పెరగలేదని మరో నివేదిక బయటపెట్టింది. 11 ఏళ్ల క్రితం ఏ వేతనం అయితే ముఖేష్ అంబానీ తీసుకున్నారో ప్రస్తుతం కూడా అదే జీతంను పొందుతున్నారని ఆ నివేదిక తెలిపింది.
11 ఏళ్లుగా పెరగని అపరకుబేరుడి జీతం
11 ఏళ్ల క్రితం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ వేతనం ఏడాదికి రూ.15 కోట్లుగా ఉన్నింది. 2008-09లో ఆయన ఈ వేతనం తీసుకున్నారు.ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి వేతనాలు పెరిగాయి. ఇందులో ముఖేష్ అంబానీ బంధువులు అయిన నిఖిల్ మరియు హితల్ మెస్వానీల వేతనం కూడా బాగానే పెరిగింది. కానీ ముఖేష్ అంబానీది మాత్రం 11 ఏళ్ల క్రితం జీతమే ఇప్పుడు కూడా తీసుకుంటున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థలో మేనేజర్ స్థాయి వ్యక్తులకు ఆదర్శంగా నిలవాలన్న ఉద్దేశంతోనే ముఖేష్ అంబానీ తన జీతంలో పెంపును కోరలేదని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వార్షిక నివేదిక పేర్కొంది.
రూ.15 కోట్లు వరకే పరిమితి పెట్టుకున్న అంబానీ
2018-19 సంవత్సరానికి ముఖేష్ అంబానీ తీసుకున్న జీతం రూ.4.45 కోట్లు ఉండగా 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.4.49 కోట్లు తీసుకున్నట్లు నివేదిక తెలిపింది. ఇక కమిషన్లు ద్వారా రూ.9.53 కోట్లు తీసుకోగా అతని ఖర్చులు మాత్రం రూ.27 లక్షల నుంచి 31 లక్షలకు ఎగబాకినట్లు సంస్థ ప్రకటించింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.71 లక్షల వరకు ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇదిలా ఉంటే తన జీతం రూ.15 కోట్లు వరకే పరిమితి ఉండాలని స్వచ్చందంగా ముఖేష్ అంబానీ కోరినట్లు సమాచారం.అక్టోబర్ 2009లో ఈ ప్రతిపాదన చేసినట్లు కంపెనీ తెలిపింది. ఇక ముఖేష్ అంబానీ బంధువులు నిఖిల్ , హితల్ మెస్వానీలు ఏడాదికి రూ.20.57 కోట్లు తీసుకుంటున్నారు. 2017-18లో ఇద్దరు చెరో రూ. 19.99 కోట్లు వేతనంగా పొందారు.
కమిషన్ రూపంలో నీతా అంబానీకి అందుతున్నది ఇంతే..!
ఇక రిలయన్స్ సంస్థలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్న పీఎంఎస్ ప్రసాద్ వేతనం రూ.8.99 కోట్లు నుంచి 10.01 కోటికి ఎగబాకినట్లు సమాచారం. రిలయన్స్ ఇండస్ట్రీస్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్న అంబానీ సతీమణి నీతా అంబానీ కమిషన్ ద్వారా రూ.1.65 కోట్లు తీసుకుంటున్నారు.ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ ఛైర్మెన్ అరుంధతీ భట్టాచార్య గతేడాది అక్టోబర్ 17న రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ బోర్డు మెంబరుగా అప్పాయింట్ అయ్యారు. ఆమె కమిషన్ రూ.75 లక్షలుగా ఉంది.