‘ఎన్ఆర్సీలో పేరు లేకున్నా హిందువులు ఇక్కడే ఉండొచ్చు’
న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) అధినేత మోహన్ భగవత్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్(ఎన్ఆర్సీ)లో పేర్లు లేకపోయినప్పటికీ ఏ ఒక్క హిందువు కూడా దేశం విడిచి వెళ్లాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.
తెలుగు సినిమాలో నటిస్తున్న ఏపీ డిప్యూటీ సీఎం: షూటింగ్ ఎక్కడంటే..?
ఆ జాబితాలో పేరు లేనంత మాత్రాన హిందువులు ఎవరూ కూడా దేశం విడిచి వెళ్లాలని లేదని మోహన్ భగవత్ అన్నారు. ఆదివారం కోల్కతాలో ఆదివారం జరిగిన బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాగా, ఆగస్టు 31న అస్సాంలో విడుదలైన ఎన్ఆర్సీ జాబితాలో లేని హిందువులు అక్కడి నుంచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడటంపై ఆయన స్పందించారు.
తుది జాబితాలో 1.9 మిలియన్ల మంది పేర్లు లేవు. అందులో ఎక్కువగా బెంగాళీ హిందువులే ఉన్నారు. ఎన్ఆర్సీ ద్వారా మనదేశంలో అక్రమంగా చొరబడిన వారిని మాత్రమే బయటికి పంపించడం జరుగుతుందని ఆయన అన్నారు. బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఆఫ్గనిస్థాన్ దేశాల నుంచి వచ్చిన ముస్లిమేతర వర్గాలకు సులభంగా భారతీయ పౌరసత్వం ఇచ్చే సిటిజన్షిప్(సవరణ) బిల్లు లేదా క్యాబ్ తీసుకురావాలన్నారు.
మనదేశం ఒక్కటే హిందువులకు ఆశ్రయం ఇవ్వగలదని మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రభుత్వం వచ్చే శీతకాల సమావేశాల్లోనే క్యాబ్ను పార్లమెంటులో ప్రవేశపెడుతుందని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. అస్సాంలో ఎన్ఆర్సీలో లేని హిందువుల్లో నెలకొన్న భయాలను దూరం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమానికి పశ్చిమబెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలిప్ ఘోష్ కూడా హాజరయ్యారు. ఎన్ఆర్సీని పశ్చిమబెంగాల్లో అమలు చేయాలని చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుండగా.. తమ రాష్ట్రంలో ఎన్ఆర్సీని ప్రవేశపెట్టేదే లేదని ఆ రాష్ట్ర సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు.