దద్దరిల్లిన జంతర్మంతర్... సీఎం యోగి రాజీనామాకు భీమ్ ఆర్మీ చీఫ్ డిమాండ్...
హత్రాస్ గ్యాంగ్ రేప్ ఘటనను నిరసిస్తూ విపక్షాలు,ప్రజా సంఘాలు,సామాజిక కార్యకర్తలు చేపట్టిన ఆందోళనతో ఢిల్లీలోని జంతర్మంతర్ దద్దరిల్లింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది. కాంగ్రెస్,వామపక్షాలు,భీమ్ ఆర్మీ ఈ ఆందోళనలో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ మాట్లాడుతూ... సీఎం యోగి ఆదిత్యానాథ్ రాజీనామా చేసేంతవరకు ఈ కేసులో న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదన్నారు. సుప్రీం కోర్టు ఇందులో జోక్యం చేసుకోవాలని కోరారు.
'ఇలాంటి నేరాలకు ఒడిగట్టే నిందితులకు వీలైనంత త్వరగా శిక్ష పడి తీరాలి. అప్పుడే మరొకరు ఇలాంటి నేరాలు చేసేందుకు భయపడుతారు. కచ్చితంగా భీమ్ ఆర్మీ హత్రాస్ వెళ్లి తీరుతుంది. ఈ కేసులో సుప్రీం కోర్టు జోక్యం చేసుకుంటే తప్ప న్యాయం జరిగే అవకాశం లేదు..' అని చంద్రశేఖర్ ఆజాద్ పేర్కొన్నారు.
జంతర్మంతర్ దగ్గర జరిగిన ఈ ఆందోళనలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా పాల్గొన్నారు. 'దోషులను కఠినంగా శిక్షించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని చేతులు జోడించి వేడుకుంటున్నాను. వారికి మరణశిక్ష విధించాలి. బాధితురాలిపై కిరాతకంగా అత్యాచారానికి పాల్పడితే... అసలు అత్యాచారమే జరగలేదని చెప్తున్నారు. హిందూ సంప్రాదాయాలకు విరుద్దంగా దహన సంస్కారాలు నిర్వహించారు. ఇవన్నీ చూస్తుంటే దోషులను రక్షించే ప్రయత్నం జరుగుతోందా అన్న అనుమానం కలుగుతోంది..' అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
జంతర్మంతర్ వేదిక వద్ద న్యాయవాది ప్రశాంత్ భూషణ్ మాట్లాడుతూ... 'ఉత్తరప్రదేశ్లో గూండాల రాజ్యం నడుస్తోంది.. పోలీసులు గ్రామాన్ని చుట్టుముట్టి ఎవరినీ లోపలికి రాకుండా చూస్తున్నారు... ఆఖరికి బాధిత కుటుంబం ఫోన్లు కూడా లాక్కున్నారు.' అని పేర్కొన్నారు.
Recommended Video
సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడుతూ... ఉత్తరప్రదేశ్లో యోగి సర్కార్ అధికారంలోకి కొనసాగేందుకు ఎంతమాత్రం అర్హత లేదన్నారు. నిజానికి ఇండియా గేట్ వద్ద ఆందోళన చేపట్టాలని విపక్షాలు,సామాజిక కార్యకర్తలు భావించినప్పటికీ పోలీస్ ఆంక్షల నేపథ్యంలో వేదికను జంతర్మంతర్కు మార్చారు.