కొత్తగా ఎన్నికయ్యే ఎంపీలు అక్కడ బసచేయరాదు: లోక్సభ సెక్రటేరియట్
సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత కొత్తగా ఎన్నికయ్యే ఎంపీలకు హోటల్ సదుపాయం కల్పించబోవడం లేదని లోక్సభ సెక్రటరీ జనరల్ స్నేహలత శ్రీవాస్తవ తెలిపారు. వారంత తమ తమ రాష్ట్ర భవనాల్లో బస చేయాల్సి ఉంటుందని తెలిపారు. వీటితో పాటు వెస్ట్రన్ కోర్టు, ఎంపీల కోసం కేటాయించిన హాస్టల్లో బసచేయొచ్చని తెలిపారు. ఇక ఫలితాల తర్వాత కొత్తగా ఎన్నికయ్యే ఎంపీలు దేశ రాజధాని ఢిల్లీకి తరలి వచ్చే అవకాశం ఉంది. వీరికోసం లోక్సభ సెక్రటేరియట్ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇక ఎంపీల కోసం ప్రభుత్వం ఖర్చు పెడుతున్న తీరుపై చాలా విమర్శలే వచ్చాయి. ఈసారి ప్రైవేట్ హోటల్స్లో బస చేసేవారికి ఎలాంటి చెల్లింపులు ఉండవని లోక్సభ సెక్రటేరియట్ తేల్చేసింది.
2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత దాదాపు 300 మంది ఆ సమయంలో కొత్తగా ఎన్నికై ఢిల్లీకి చేరుకున్నారు. పాత ఎంపీలు తమ అధికార నివాసాలను ఖాళీ చేయకపోవడంతో కొత్తగా వచ్చిన ఎంపీలు బసచేసేందుకు చాలా ఇబ్బందులు పడ్డారు. దీంతో వీరికోసం లోక్సభ సెక్రటేరియట్ కొత్త ఎంపీల బస చేసేందుకు గాను పలు స్టార్ హోటల్స్లో గదులు కేటాయించింది. ఇందుకోసం అయిన ఖర్చు రూ.30 కోట్లు. ఇక దీన్ని దృష్టిలో ఉంచుకొని 88 కొత్త బ్లాకులు నిర్మించాల్సిందిగా లోక్సభ హౌజింగ్ కమిటీ సూచించింది.
ఇక అధికారుల సమాచారం ప్రకారం 100 కొత్త ఎంపీలు బస చేసేందుకుగాను వెస్ట్రన్ కోర్టును సిద్ధం చేశారు. ఇక 265 మంది ఎంపీలు వారి వారి రాష్ట్రాలకు చెందిన భవనాల్లో బసచేస్తారు. ఇక కొత్త ఎంపీలు ఎన్నికైన తర్వాత వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు అంటే రిజిస్ట్రేషన్, టెక్నాలజీకి సంబంధించిన ఏర్పాట్లు ఇతరత్ర పేపర్ వర్క్లు, వారి జీతభత్యాలకు సంబంధించిన ఏర్పాట్లు అన్నిఇప్పటికే సిద్ధం చేసినట్లు చెప్పారు. అంతేకాదు ఇందిరాగాంధీ విమానాశ్రయంలో ఎంపీల కోసం హెల్ప్డెస్క్లను ఏర్పాటు చేశారు. 56 నోడల్ ఆఫీసర్లను కూడా అసైన్ చేసినట్లు శ్రీవాస్తవ తెలిపారు. వీరంతా కొత్తగా ఎన్నికైన ఎంపీలకు సహాయం చేస్తుంది.