ఈ రోజు ఏ భారతీయుడూ మర్చిపోలేడు: పుల్వామా ఘటనపై ప్రధాని మోడీ, వీరజవాన్లకు నివాళి
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్లోని పుల్వామాలో 2019, ఫిబ్రవరి 14న జరిగిన ఉగ్రదాడిని ఏ భారతీయుడూ మర్చిపోలేడని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. పుల్వామాలో జరిగిన ఉగ్రవాదుల బాంబు దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు.
భారత సైనికులు తమ ధైర్యసాహసాలతో నేటి, భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తూనే ఉన్నారని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. అమరవీరుల త్యాగాలకు భారత ప్రజలంతా ఘన నివాళులర్పిస్తున్నారు. తమిళనాడు రాజధాని చెన్నైలో పర్యటించిన ప్రధాని మోడీ.. దేశీయంగా అభివృద్ధి చేసిన యుద్ధ ట్యాంక్ 'అర్జున్'(మార్క్ 1ఏ)ను ఆర్మీ అధిపతి జనరల్ ఎంఎం నరవణేకు అందజేశారు.
అంతేగాక, చెన్నైలో పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ప్రసంగించారు. తమిళ రచయిత, కవి సుబ్రమణియా భారతిని గురించి ఆయన ప్రస్తావించారు. 'ఆయుధాలు తయారు చేద్దాం, కాగితం తయారు చేద్దాం, కర్మాగారాలు చేద్దాం, పాఠశాలలు చేద్దాం, వాహనాలు తయారు చేద్దాం, ఓడలు తయారు చేద్దాం" అని అన్నారు. సుబ్రమణియా భారతి దృష్టితో ప్రేరణ పొందిన భారతదేశం రక్షణ రంగంలో స్వావలంబన సాధించడానికి భారీ ప్రయత్నం చేసిందని ప్రధాని వ్యాఖ్యానించారు.
భారత సైనికులు మనదేశ భద్రతకు కోసం చూపుతున్న ధైర్యసాహసాలు దేశ పౌరులకు స్ఫూర్తిదాయకమని అన్నారు. మాతృభూమి కోసం వారు చేస్తున్న త్యాగాలను మరువలేమని అన్నారు. అందుకే ప్రపంచంలోనే అత్యాధునిక ఆయుధాలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని మన జవాన్లకు అందిస్తున్నామని ప్రధాని తెలిపారు. ప్రధానితోపాటు పలువురు కేంద్రమంత్రులు, ప్రముఖులు పుల్వామా అమరుల త్యాగాలను స్మరించుకున్నారు.
సైనికుల త్యాగాలను దేశం ఎప్పటికీ మరువదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. పుల్వామాలో రెండేళ్ల క్రితం ఇదే రోజున సీఆర్పీఎఫ్ జవాన్ల వాహన శ్రేణిపై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఆ దుర్ఘటనలో అమరులైన జవాన్లకు రాజ్ నాథ్ సింగ ఆదివారం నివాళుర్పించారు. 2019లో పుల్వామా ఉగ్రదాడిలో వీర మరణం పొందిన సైనికులకు నివాళులర్పిస్తున్నాను.
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. 'మన బంగారు భవిష్యత్ కోసం పూల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు నివాళులు. ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో మీ త్యాగాలు ఎప్పటికే మాకు ఆదర్శమే' అని వ్యాఖ్యానించారు. మరోవైపు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా వీర మరణం పొందిన సైనికులకు నివాళులర్పించారు. అమరవీరుల కుటుంబాలకు దేశం రుణపడి ఉంటుందని అన్నారు.
2019, ఫిబ్రవరి 14న పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనంపై జేషే ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడిన విషయం తెలిసందే. ఈ దాడిలో 40 మంది జవాన్లు అమరులయ్యారు. ఆ తర్వాత ఇందుకు ప్రతీకారంగా భారత్.. పాకిస్థాన్లోని బాలాకోట్ జైషే ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ స్టైక్స్ జరిపింది. ఈ దాడిలో సుమారు 300 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.