కూలిన విమానంలో మనవాళ్లు లేరు: అశోక్ గజపతి
న్యూఢిల్లీ: ఉక్రెయిన్లో కూలిన మలేషియా విమానంలో భారతీయులు ఎవరూ లేరని భారత పౌర విమాన యానాల మంత్రి పి. అశోక్ గజపతి రాజు చెప్పారు. సంఘటన అత్యంత దురదృష్టకరమైందని ఆయన అన్నారు. ఉక్రెయిన్ మీదుగా రావద్దని ప్రభుత్వం ఇప్పటికే భారత విమానయాన సంస్థలను ఆదేశించినట్లు తెలిపారు.
రష్యా సరిహద్దుల్లోని ఉక్రెయిన్లో క్షిపణితో దాడి చేయడంతో మలేషియా విమానం కూలిపోయి 298 మంది దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. మన పౌరుల భద్రత తమకు ముఖ్యమని మంత్రి చెప్పారు. ఉక్రెయిన్ దారిలో రావద్దని భారత తన సొంత ఎయిర్ లైన్స్ జెట్ లేదా ఎయిర్ ఇండియాను భారత ప్రభుత్వం ఆదేశించిందని ఆయన చెప్పారు. భారతీయుల ప్రాణాలు పోలేదనే సమాచారం ఎంతో ఆనందాన్నిచ్చిందని ఆయన అన్నారు.
ఐరోపాకు, ఉత్తర అమెరికాకు వెళ్లే రెండు విమానాలను కూడా ఉక్రెయిన్ మార్గంలో రాకుండా చూడాలని ఎయిర్ ఇండియాకు, జెట్ ఎయిర్వేస్కు పౌరవిమాన యానాల ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టర్ జనరల్ గురువారంనాడే సూచనలు చేశారు.
అంతర్జాతీయ మార్గదర్శకాల ప్రకారం ఉక్రెయిన్ వంటి ఉద్రిక్త ప్రాంతాల ఎయిర్ స్పేస్ను వాడుకోవడం లేదని ఎయిర్ ఇండియా అధికారులు అంటున్నారు. ఉక్రెయిన్ మీది మార్గం ఐరోపాను, ఆసియాను కలుపుతుంది. ఇది రద్దీగా ఉంటుంది.