ఏ భారతీయుడినీ వదిలేదిలేదు, ఆందోళన వద్దు: ఎన్ఆర్సీపై రాజ్నాథ్ సింగ్
న్యూఢిల్లీ: నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్సీ)పై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ శుక్రవారం రాజ్యసభలో స్పందించారు. విపక్షాల అనుమానాలను నివృత్తి చేసే ప్రయత్నం చేశారు. ఎన్ఆర్సీ చాలా పారదర్శకంగా కొనసాగుతోందని చెప్పారు. సుప్రీం కోర్టు నియమ నిబంధనల మేరకు నడుచుకుంటున్నామని చెప్పారు. ప్రతి అంశాన్ని తాము క్షుణ్ణంగా అనుసరిస్తున్నామన్నారు.
నేను హామీ ఇస్తున్నానని, ఎన్ఆర్సీలో ఒక్క భారతీయుడిని కూడా వదులుకోమని చెప్పారు. అందర్నీ ఎన్ఆర్సీలో చేర్చుతామని, ఎవరికీ అనుమానాలు అవసరం లేదన్నారు. ప్రస్తుతం చేపడుతున్న ప్రక్రియ ముసాయిదా మాత్రమే అన్నారు. ఏ భారతీయుడిని పౌరసభ్య జాబితాలో చేర్చకుండా వదిలేయమన్నారు.
అసోంలోని ఎన్ఆర్సీ ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని, ఎలాంటి వివక్ష లేదన్నారు. ముసాయిదాపై ఎవరూ కంగారుపడాల్సిన అవసరం లేదన్నారు. దీనిపై కావాలనే కొందరు ప్రజల్లో భయాందోళనలు కలిగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ఆర్సీ ముసాయిదాలో పేరు లేనివారిపై ఎలాంటి చర్యలు చేపట్టబోమన్నారు.
ఓసారి తుది జాబితా విడుదల చేసిన తర్వాత కూడా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అందరికీ ఉంటుదని రాజ్నాథ్ తెలిపారు. అది వారి హక్కు అన్నారు. ఆ హక్కును ఎవరూ తీసుకోలేరని స్పష్టం చేసారు.
కాగా, అసోం ఎన్ఆర్సీ గత సోమవారం విడుదల చేసింది. దీనిపై ప్రతిపక్షాలు ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇదే విషయమై గురువారం తృణమూల్ నేతలు కొందరు అసోం వెళ్లారు. వారిని పోలీసులు విమానాశ్రయంలోనే అడ్డుకున్నారు. దీంతో రాత్రంతా వారు విమానాశ్రయంలోనే ఉన్నారు. దీంతో టీఎంసీ నేతలు శుక్రవారం ఉదయం వెనుదిరిగారు.
టీఎంసీ నేతలను అడ్డుకున్న ఘటనపై ఆ పార్టీ ఎంపీలు లోకసభలో నిరసన చేపట్టారు. దీంతో సభ కొంతసేపు వాయిదా పడింది. ఆ తర్వాత కాంగ్రెస్ కూడా ఇదే అంశాన్ని లేవనెత్తింది. అసోంలో మాదిరిగానే అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్ఆర్సీ ప్రక్రియ చేపడుతారా అని ప్రభుత్వాన్ని అడిగింది.