ఆరు నెలల్లో చైనా నుంచి చొరబాట్లే లేవు- రాజ్యసభలో కేంద్రం షాకింగ్...
ఆరునెలలుగా చైనా సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. గల్వాన్ ఘటనలోనూ చైనా బలగాలు భారత భూభాగంలోకి వచ్చి చేసిన దాడుల్లో పదుల సంఖ్యలో మన సైనికులు చనిపోయారు. అప్పట్లో చైనా మన భూభూగంలోకి రాకపోతే మన సైనికులు ఎలా చనిపోయారని విపక్ష నేత రాహుల్ గాంధీ సైతం కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు. కానీ తాజాగా కేంద్రం మాత్రం ఆరునెలల్లో అసలు చొరబాట్లే జరగలేదని చెబుతోంది.
అడ్డంగా దొరికిన మోదీ - చైనా పేరెత్తడానికి భయమెందుకు?: రాజ్నాథ్ ప్రకటనపై రాహుల్ గాంధీ
రాజ్యసభలో ఎంపీ అనిల్ అగర్వాల్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా హోంశాఖ మంత్రి (మినిస్టర్ ఆఫ్ స్టేట్) నిత్యానందరాయ్ సమాధానం ఇచ్చారు. ఇందులో గత ఆరునెలల్లో చైనా సరిహద్దుల వెంబడి ఎలాంటి చొరబాట్లు జరగలేదని, కేవలం వాస్తవాధీన రేఖ అతిక్రమణమలు మాత్రమే జరిగాయన్నారు. అంతకు మంచి ఆయన మిగతా వివరాలు వెల్లడించలేదు. కానీ పాకిస్తాన్ సరిహద్దుల నుంచి మాత్రం ఫిబ్రవరి నుంచి 47 చొరబాట్లు జరిగాయన్నారు.
చైనా సరిహద్దుల్లో ఆరునెలలుగా తీవ్ర ప్రతిష్టంభన కొనసాగుతుండటం, సరిహద్దుల్లో యథాతథ స్ధితి కావాలంటూ అంతర్జాతీయ వేదికలపై సైతం కేంద్రమంత్రులు కోరుతున్న నేపథ్యంలో మంత్రి నిత్యానందరాయ్ పార్లమెంటుకు ఇచ్చిన సమాధానం వివాదాస్పదంగా మారింది. చొరబాట్లే జరగకపోతే స్టేటస్కో కావాలని కేంద్రం ఎందుకు కోరుతోందని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. అయితే కేంద్రం మాత్రం నిత్యానందరాయ్ చెప్పింది కేవలం తీవ్రవాద చొరబాట్లే అంటూ సర్దిచెప్పేందుకు ప్రయత్నిస్తోంది. లోక్సభలో రక్షణ మంత్రి కూడా చైనా నుంచి సరిహద్దు అతిక్రమణలు మాత్రమే ఉన్నాయని చెప్పారని గుర్తు చేస్తోంది.