ఎన్నారైల ఆదాయపుపన్నుపై క్లారిటీ ఇచ్చిన నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: ఆదాయపుపన్ను విషయంలో ప్రవాస భారతీయుల(ఎన్ఆర్ఐ)లో నెలకొన్న సందిగ్ధతను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా చేసిన స్పష్టమైన ప్రకటనతో తొలగించారు. ప్రవాస భారతీయులు కేవలం భారతదేశంలో ఆర్జించే సంపాదనకు మాత్రమే పన్ను చెల్లించాలని ఆమె స్పష్టం చేశారు.
ఇతర దేశాల్లో సంపాదించే మొత్తాలకు పన్ను కట్టాల్సిన అవసరం లేదని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఎన్ఆర్ఐలు ఇతర దేశాల్లో ఆదాయం పొందవచ్చు.. కానీ, వారికి ఇక్కడ ఉండే ఆస్తి నుంచి వచ్చే ఆదాయంపై పన్ను తీసుకునేందుకు మాత్రం ప్రభుత్వానికి హక్కు ఉందని చెప్పారు.
బడ్జెట్లో ప్రవేశపెట్టిన ఈ కొత్త పన్ను విధానంపై అధికారులు కూడా అయోమయానికి గురికావద్దని కోరారు. దీనికి సంబంధించి కేంద్ర ఆర్థికశాఖ ఆదివారం ఒక ప్రకటన జారీ చేసింది. భారతీయ పౌరుడు ఇతర దేశాల్లో ఆర్జించిన సంపాదనకు పన్ను విధించబడదని, అయితే, భారత్లో ఉండే వ్యాపారం, లేదా వృత్తి నుంచి గానీ ఆదాయం పొందితే దానిపై పన్ను విధించచడం జరుగుతుందని ఆ ప్రకటనలో వెల్లడించారు. అవసరమైతే ఈ నిబంధనను చట్టంలో చేరుస్తామని పేర్కొన్నారు.
కాగా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఆమె చేసిన బడ్జెట్ ప్రసంగంలో ఎన్నారైలకు చెందిన ఆదాయపుపన్ను గురించి ప్రస్తావించారు. అయితే, ఆమె ప్రకటనపై ప్రవాసుల్లో కొంత ఆందోళన, సంధిగ్తత నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా కేంద్రమంత్రి స్పష్టమైన ప్రకటన చేసినట్లు తెలుస్తోంది.
Government clarifies that in case of an Indian citizen who becomes deemed resident of India under this proposed provision, income earned outside India by him shall not be taxed in India unless it is derived from an Indian business or profession. https://t.co/2NDOWh64GZ
— ANI (@ANI) February 2, 2020
సామాన్యునికి ఊరట.. వ్యక్తిగత ఆదాయపుపన్ను శ్లాబ్స్ ఇలా..
కొత్త పన్ను శ్లాబ్స్ ఇలా.. ఆదాయం రూ. 5లక్షల నుంచి 7.5లక్షలు ఉన్న వారికి 10 శాతం పన్ను, రూ. 7.5లక్షల నుంచి 10 లక్షల వరకూ 15 శాతం పన్ను, రూ. 10 లక్షల నుంచి రూ. 12.5లక్షల వరకూ 20 శాతం పన్ను వర్తిస్తుందని, రూ. 12.5 లక్షల ఆదాయం వరకూ 25 శాతం పన్ను ఉంటుందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రూ. 15 లక్షల ఆదాయం కంటే ఎక్కువగా ఉంటే 30శాతం పన్ను చెల్లించాల్సిందిగా మంత్రి చెప్పారు. కొత్త ఆదాయం పన్ను విధానం ఐఛ్చికం అని తెలిపారు. మినహాయింపులు పొందాలా? వద్దా? అన్నది వేతన జీవులపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. దీంతో పాత విధానంతోపాటు కొత్త విధానం కూడా అమల్లో ఉంటుంది. కొత్త పన్ను విధానం ఎంచుకుంటే 80(సీ) కింద వచ్చే మినహాయింపులు ఉండవు.