జూలై 15 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు.. డీజీసీఏ కీలక ప్రకటన..
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో... జూలై 15 వరకూ ఇంటర్నేషనల్ కమర్షియల్ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్టు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) ప్రకటించింది. అదే సమయంలో కార్గో విమాన సర్వీసులకు మాత్రం ఇది వర్తించదని పేర్కొంది. అలాగే ఎంపిక చేసిన కొన్ని రూట్లలో ఇంటర్నేషనల్ విమాన సర్వీసులను కూడా అనుమతించే అవకాశం ఉన్నట్టు తెలిపింది.
Recommended Video
విదేశీ విమాన సర్వీసుల కోసం విపరీతమైన డిమాండ్ ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో న్యూఢిల్లీ-న్యూయార్క్,ముంబై-న్యూయార్క్ మార్గాల్లో విమాన సర్వీసులను నడిపే అవకాశం ఉన్నట్టు తెలిపింది. అలాగే గల్ఫ్ దేశాలకు ప్రైవేట్ ఎయిర్ లైన్స్ను కూడా అనుమతించే అవకాశం ఉన్నట్టు స్పష్టం చేసింది.
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో దేశీ,విదేశీ విమానాలన్నింటిని భారత్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. దాదాపు రెండు నెలల తర్వాత మే 25వ తేదీ నుంచి దేశీ విమాన సర్వీసులను పునరుద్దరించారు. అప్పటినుంచి ఇప్పటివరకూ 21,316 దేశీ విమాన సర్వీసులను నడిపారు. దాదాపు 19 లక్షల ప్రయాణికులు వీటిల్లో ప్రయాణించారు.జూన్ 30వ తేదీతో అన్ లాక్ 1.0 పూర్తి కానున్న నేపథ్యంలో కేంద్రం అన్ లాక్ 2.0కి సంబంధించి సరికొత్త మార్గదర్శకాలు ఇచ్చే అవకాశం ఉంది.