వలస కార్మికుల ప్రయాణాలపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు జారీ
న్యూఢిల్లీ: వలస కూలీల ప్రయాణం విషయంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా మరోసారి మార్గదర్శకాలను జారీ చేసింది. క్యాంపుల్లో ఉన్నవారికి రాష్ట్రం దాటి వెళ్లేందుకు అనుమతులు లేవని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు.
స్వరాష్ట్రంలోని వారికి మాత్రం పని ప్రదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇస్తున్నట్లు హోంశాఖ స్పష్టం చేసింది. క్యాంపుల్లో ఉన్నవారితోపాటు వారు చేసే పనుల వివరాలు నమోదు చేయాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. అవకాశం ఉంటే వారు ఉన్న క్యాంపు ప్రదేశంలోనే ఆహారం, రవాణా సౌకర్యాలు కల్పించి పనులు చేయించుకోవచ్చని స్పష్టం చేసింది.
అయితే, సామాజిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటూ వారితో పనులు చేయించుకోవాలని సూచించింది. కరోనా లాక్డౌన్ అమల్లో ఉన్నందున పనుల నిమిత్తం వెళ్లి వేరే రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వారికి ఆయా రాష్ట్రాల్లోనే వసతి, భోజనం, మందులు సమకూర్చేలా ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం పలు మార్గదర్శకాలను జారీ చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలు కూడా ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కూలీలకు క్యాంపులు ఏర్పాటు చేసి వారికి కావాల్సిన అవసరాలను తీరుస్తున్నాయి. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో కేంద్రం మరోసారి ఈ మేరకు తాజా మార్గదర్శకాలను జారీ చేసింది.
ఇప్పటికే ఈ కామర్స్ క్రయవిక్రయాలను కూడా మే 3 వరకు అనుమతించేది లేదని కేంద్రం తెలిపిన విషయం తెలిసిందే. అంతేగాక, కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో మే 3 తర్వాత కూడా రైళ్లు, విమాన సర్వీసులు ప్రారంభించే అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపింది.