కశ్మీర్ యువతకు కేంద్రం వార్నింగ్-రాళ్లు విసిరితే ఇక నో జాబ్, నో పాస్ పోర్ట్
జమ్ముకశ్మీర్ లో తీవ్ర వాద సమస్యను రూపుమాపే పేరుతో ఆర్టికల్ 370, ఆర్టికల్ 35 రద్దు చేసిన కేంద్రానికి ఇప్పుడు అక్కడ ఏం చేయాలో పాలుపోవడం లేదు. కశ్మీర్ ను ముూడు ముక్కలు చేసి రెండేళ్లు పూర్తవుతున్నా అక్కడ తీవ్రవాదం తగ్గుతున్న ఆనవాళ్లు కనిపించకపోవడంతో అక్కడ యువతను కట్టడి చేసేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది.
జమ్మూకశ్మీర్ లో అధికారులపై రాళ్లు రువ్వే వారికి, జాతి వ్యతిరేక కార్యకలాపాల్లో పాలుపంచుకునే వారిపై ఇక మరింత కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీరికి ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించబోమని, అలాగే పాస్ పోర్టు క్లియరెన్స్ కూడా ఇవ్వబోమని అధికారులు తాజాగా స్పష్టం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కల్పించే వారి వివరాలు ఇప్పటికే తమ వద్ద ఉన్నాయని, పదే పదే సంఘ వ్యతిరేక చర్యలకు పాల్పడితే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఇప్పటికే జమ్ముకశ్మీర్ లో సీఐడీ అధికారుల క్లియరెన్స్ ఉంటేనే ప్రభుత్వ ఉద్యోగాలకు అనుమతిచ్చేలా 1997 నాటి నిబంధనలను సవరిస్తూ ప్రభుత్వం ఓ ఉత్తర్వు జారీ చేసింది. దీనికి అదనంగా పాస్ పోర్టులకు అనుమతి కూడా ఇవ్వబోమని తేల్చిచెప్పింది.
దీంతో ఇకపై జమ్ముకశ్మీర్ లో మరింత కఠినంగా నిబంధనలు అమలవుతాయని చెప్పకనే చెప్పింది. మరోవైపు ఇక్కడ ఎన్నికల నిర్వహణకు ప్రయత్నాలు చేస్తున్న కేంద్రానికి స్ధానికుల నుంచి ఎదురవుతున్న వ్యతిరేకత సమస్యాత్మకంగా మారుతోంది. దీంతో ముందుగా శాంతిభద్రతల్ని అదుపులోకి తీసుకొచ్చాకే ఎన్నికల ఏర్పాట్లు చేయాలని కేంద్రం భావిస్తోంది.