సాంకేతిక లోపంతో చంద్రయాన్-2 ప్రయోగం వాయిదా..కొత్త తేదీ ప్రకటిస్తామన్న ఇస్రో
శ్రీహరికోట: ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చంద్రుడిపైకి పంపాల్సిన చంద్రయాన్-2 ప్రయోగం నిలిచిపోయింది. సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ప్రస్తుతానికి ఆగిపోయింది. కొత్త తేదీని త్వరలోనే ఇస్రో ప్రకటించనుంది. అంతా సవ్యంగా సాగుతుందనుకునే సమయంలో టి-56 నిమిషంలో వాహక నౌకలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రయోగంను నిలిపివేసినట్లు ఇస్రో అధికారులు తెలిపారు. దీంతో సోమవారం జరగాల్సిన చంద్రయాన్-2 ప్రయోగం వాయిదా పడింది. త్వరలోనే చంద్రయాన్ -2 చంద్రుడిపైకి పంపే తేదీని ఇస్రో ప్రకటిస్తుందని ఆ సంస్థ ప్రతినిధి తెలిపారు.
సోమవారం తెల్లవారుజామున 2.51 నిమిషాలకు నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లనుంది. శనివారం నాడు షార్ సెంటర్లో రాకెట్ సన్నద్ధత సమావేశం నిర్వహించారు. రాకెట్ ప్రయోగ రిహార్సల్స్ ద్వారా పలు అంశాలను పరిశీలించి అంతా ఓకే అనుకున్నాక ప్రయోగానికి పచ్చజెండా ఊపారు. చంద్రయాన్-2కు కౌంట్డౌన్ ఆదివారం ఉదయం 6 గంటల51 నిమిషాలకు ప్రారంభమైంది. అంతా సిద్ధంగా ఉన్న సమయంలో రాకెట్ లాంచ్ వెహికల్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రయోగం నిలిచిపోయింది. అయితే ఈ స్పేస్ క్రాఫ్ట్ టేకాఫ్ వీక్షించేందుకు వచ్చిన ఔత్సాహికులకు మాత్రం నిరాశే మిగిలింది. అసలు ఎక్కడ సాంకేతిక సమస్య తలెత్తిందనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇంధనం నింపే ప్రకియలోన లేక ఇతర సాంకేతిక సమస్యలా అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.
A technical snag was observed in launch vehicle system at 1 hour before the launch. As a measure of abundant precaution, #Chandrayaan2 launch has been called off for today. Revised launch date will be announced later.
— ISRO (@isro) July 14, 2019
ఇదిలా ఉంటే స్పేస్ క్రాఫ్ట్ నింగిలోకి ఎగిరిన తర్వాత సాంకేతిక సమస్యలు తలెత్తి ఉంటే మొత్తం ప్రాజెక్టు సముద్రపాలు అయ్యేది. ప్రాజెక్టుకు మొత్తం రూ.980 కోట్లు బడ్జెట్తో చంద్రయాన్ -2కు ఊపిరి పోశారు. అయితే ఇక్కడ డబ్బుల సమస్య కాదు కానీ ప్రపంచదేశాలు చంద్రయాన్-2ను ప్రయోగిస్తున్నభారత్ వైపే చూస్తున్నాయి. ఇప్పటివరకు చంద్రుడిపైకి తమ రోవర్లను పంపి పరిశోధనలు చేసిన దేశాలుగా అమెరికా, రష్యా, చైనా దేశాలు మాత్రమే ఘనత సాధించాయి. ఒకవేళ చంద్రయాన్-2 ప్రయోగం సక్సెస్ అయి ఉంటే భారత్ నాలుగో దేశంగా నిలిచేది.