మాకు ప్రధాని అభ్యర్థిగా మోడీ ఉన్నారు..మీకెవరున్నారు: ఉద్ధవ్ థాక్రే
ఒకప్పుడు శివసేన బీజేపీల మధ్య విబేధాలు తలెత్తాయని కానీ ఇప్పుడంతా సర్దుకుందన్నారు శివసేన ఛీఫ్ ఉద్దవ్ థాక్రే. బీజేపీ శివసేనల భావజాలం ఒక్కటే అని చెప్పిన ఉద్ధవ్ థాక్రే రెండు పార్టీలు కలిసే ఈ ఎన్నికల్లో పనిచేస్తున్నాయని అన్నారు. నిన్న మొన్నటి వరకు ప్రధానిపై విరుచుకుపడిన శివసేన నేత ఇప్పుడు అదే ప్రధాని మోడీపై పొగడ్తల వర్షం కురిపించారు. అమిత్ షా నామినేషన్కు ముందు ఓ ర్యాలీలో ప్రసంగించిన ఉద్ధవ్ థాక్రే ఈ వ్యాఖ్యలు చేశారు.
తాను అమిత్ షా నామినేషన్ కార్యక్రమానికి హాజరైనందుకు చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తారని, కానీ అంతకంటే ఎక్కువ మంది సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. కొందరికేమో కడుపునొప్పిగా ఉంటుందని చెప్పారు. రెండు భావసారూప్యత ఉన్న పార్టీలు ఒకరితో ఒకరు విబేధిస్తున్న సమయంలో కొన్ని పార్టీలు సంబరపడ్డాయని చెప్పారు ఉద్ధవ్ థాక్రే. ఒకప్పుడు రెండు పార్టీల మధ్య విబేధాలు ఉన్న మాట వాస్తవమే అని అయితే బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తన ఇంటికి వచ్చి అన్ని సమస్యలపై కూలంకుషంగా చర్చించుకున్న తర్వాత విబేధాలన్నీ సమసిపోయినట్లు తెలిపారు. ఏది చేయాలన్న అది వెనకనుంచి కాకుండా బహిరంగంగానే చేయాలని తన తండ్రి బాల్ థాక్రే తమకు నేర్పారని అన్నారు ఉద్దవ్ థాక్రే. ఇప్పటి వరకు తాము ప్రజల సమస్యలపై పోరాడామని చెప్పారు. బీజేపీ శివసేనలది హిందూత్వ వాదమే అని అది తమ ఊపిరిగా బాల్థాక్రే చెప్పేవారని గుర్తు చేసిన ఉద్ధవ్... ఒకవేళ ఆ ఊపిరి ఆగితే తాము ఎలా బతకగలం అని ప్రశ్నించారు.
బీజేపీ శివసేనల మధ్య గొడవ ఉన్న మాట నిజమే అని అయితే ఇది గతం అని ఇప్పుడు తమ దృష్టి అంతా ఈ ఎన్నికల్లో విజయం సాధించడమే అని అన్నారు. రెండు పార్టీలు కాషాయం జెండానే మోశాయని గుర్తు చేశారు ఉద్దవ్ థాక్రే. గత 25 ఏళ్లుగా ఇదే జరుగుతోందన్నారు. గత ఐదేళ్లుగా బీజేపీ శివసేనల మధ్య సఖ్యత చెడింది. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. అయితే వీరిద్దరూ మళ్లీ పొత్తుతో వెళతారని ఎవరూ ఊహించలేదు. కానీ ఇద్దరి మధ్య విబేధాలు సమిసిపోవడంతో 2019 లోక్సభ ఎన్నికల్లో కలిసి ప్రయాణం చేస్తున్నారు. ఇక వీరిద్దరి కలయికపై విపక్షాలు మళ్లీ మాటల యుద్ధానికి దిగాయి. దీనిపై స్పందించారు శివసేన ఛీఫ్. తమకు మోడీ ప్రధాని అభ్యర్థిగా ఉన్నారని విపక్షాలు ఇప్పటికీ తమ ప్రధాని అభ్యర్థిపై ఎటూ తేల్చుకోలేకున్నారని అన్నారు.