ప్రీతిజింతా వేధింపుల కేసు: సీసీటీవీల్లో దొరకని ఆధారం
ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటి, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ యజమాని ప్రీతిజింతాకు ప్రముఖ వ్యాపారవేత్త నెస్ వాడియా వేధింపుల కేసులో.. పోలీసులకు వాంఖేడే స్టేడియంలోని సీసీటీవీ కెమెరాల నుండి ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలుస్తోంది. వాంఖేడే స్టేడియంలోని గార్వేర్ పెవిలియన్ వద్ద ఐదు సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి.
ఈ సీసీటీవీ కెమెరాల్లో వేధింపులకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని సమాచారం. ప్రీతిజింతా, నెస్ వాడియాల మధ్య వాదనలు జరిగినట్లుగా ఆధారాలు కనిపించలేదు.
వాంఖేడే స్టేడియంలో 172 రొటేటింగ్ సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. అందులో ఐదు సీసీటీవీ కెమెరాలు గార్వేర్ పెవిలియన్ వద్ద ఉన్నాయి. అయితే, ఈ సీసీటీవీ ఫుటేజిలలో మాత్రం వాగ్వాదం, వేధింపులకు సంబంధించిన ఆధారాలు లభించలేదు. అయితే అవి రొటేటింగ్ కెమెరాలు కావడం గమనార్హం.
కాగా, మే 30వ తేదీన కింగ్స్ ఎలెవన్ పంజాబ్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ సమయంలో నెస్ వాడియా తనను లైంగికంగా వేధించాడని ప్రీతిజింతాఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆమె జూన్ 12వ తేదీన ఫిర్యాదు చేసింది. పలువురు సాక్ష్యులను కూడా పేర్కొంది. పోలీసులు దీనిపై విచారణ జరుపుతున్నారు.