స్విస్ బ్యాంకుల్లో డబ్బు దాచిన వారి జాబితా లేదు: జైట్లీ
న్యూఢిల్లీ: స్విస్ బ్యాంకులలో భారతీయులెవరూ డబ్బు దాయలేదని ఆ దేశం చెప్పినట్లుగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం రాజ్యసభలో చెప్పారు. అయితే స్విట్జర్లాండు జాతీయ బ్యాంక్ వెబ్సైట్లో మాత్రం.. 2013 చివరి నాటికి తమ దేశ బ్యాంకుల్లో భారతీయులు జమ చేసిన ధనం విలువ రూ.14,100 కోట్లకు చేరిందని ఉన్నట్లు పేర్కొన్నారు.
రాజ్యసభలో ఓ పార్లమెంటు సభ్యుడు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ జైట్లీ మాట్లాడారు. స్విస్ బ్యాంకులలో భారతీయులు దాచిన ధనం వివరాలు కోరుతూ జూన్ 23న స్విస్ అధికారులకు లేఖ రాశామని, స్విట్జర్లాండులోని ఆర్థిక సంస్థల్లో భారతీయులు ఎవరూ తమ సొంత పేర్లతో కానీ ఇతర మార్గాల్లో కానీ డబ్బు దాయలేదని చెప్పారన్నారు.
తమ సొంత పేర్లతో లేదా ఇతర మార్గాల్లో కానీ తమ వద్ద డబ్బు దాచిన జాబితాలు తమ వద్ద లేదని వారు జూలై 4వ తేదీన సమాధానమిచ్చారని అరుణ్ జైట్లీ పేర్కొన్నారు.
అయితే, నల్లధనాన్ని వెనక్కి తీసుకు వచ్చేందుకు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎంబీ షా నేతృత్వంలోని ప్రత్యేక దర్యాఫ్తు బృందం (సిట్) కృషి చేస్తోందని అరుణ్ జైట్లీ తెలిపారు.