శుభవార్త.. డెబిట్ కార్డ్పై రూ.2 వేల వరకు చార్జీల్లేవు!
న్యూఢిల్లీ: డిజిటల్ పేమెంట్స్ను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. డెబిట్ కార్డుల ద్వారా చేస్తున్న లావాదేవీలపై వసూలు చేస్తున్న మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్)లో కొన్ని సడలింపులు చేసింది.
ఇక నుంచి రూ.2 వేల వరకు ఎలాంటి చార్జీ పడబోదని ప్రభుత్వం స్పష్టంచేసింది. 2018, జనవరి 1 నుంచి రెండేళ్ల పాటు ఈ భారం ప్రభుత్వమే మోయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది.
రూ.2 వేల వరకు డెబిట్ కార్డ్ లేదా భీమ్ యూపీఐ లేదా ఏఈపీఎస్ ద్వారా చేస్తున్న లావాదేవీలపై వ్యాపారస్తుల నుంచి ఎలాంటి చార్జీ వసూలు చేయరు. ఈ మొత్తాన్ని ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లిస్తుంది.
డెబిట్, క్రెడిట్ కార్డు సర్వీసులపై వ్యాపారస్తుల నుంచి బ్యాంకులు వసూలు చేసేదే మర్చంట్ డిస్కౌంట్ రేట్(ఎండీఆర్). తాజా నోటిఫికేషన్ ప్రకారం.. ఏడాదికి రూ.20 లక్షలలోపు టర్నోవర్ ఉన్న చిన్న వ్యాపారస్తులు పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) మెషిన్లపై డెబిట్ కార్డుల ద్వారా చేసే ఒక్కో లావాదేవీపై 0.4 శాతం ఎండీఆర్ విధించాలని నిర్ణయించారు. ఇది గరిష్ఠంగా రూ.200 వరకు ఉంటుంది.
ఇక క్యూఆర్ (క్విక్ రెస్పాన్స్) కోడ్ ద్వారా లావాదేవీలు జరిపితే 0.3 శాతం చార్జీ వసూలు చేస్తారు. ఇది కూడా గరిష్ఠంగా రూ.200 వరకు ఉంటుంది. ఏడాదికి రూ.20 లక్షలకుపైన టర్నోవర్ ఉండే వ్యాపారస్తులకు ఇది 0.9 శాతం (డెబిట్కార్డ్పై), గరిష్ఠంగా రూ.1000 వరకు ఉంటుంది. క్యూఆర్ కోడ్ లావాదేవీలపై ఇది 0.8 శాతం, గరిష్ఠంగా రూ.1000 ఉండనుంది. ఇవన్నీ 2018 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని ఆర్బీఐ వెల్లడించింది.