జైట్లీ పేరు ప్రస్తావించని డీడీసీఏ స్కాం విచారణ బృందం
న్యూఢిల్లీ: ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ)లో కుంభకోణానికి సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం విచారణ కమిటీని నియమించిన విషయం తెలిసిందే. కాగా, చేతన్ సంఘీ నేతృత్వంలోని ముగ్గురు సభ్యులతో కూడిన ఈ కమిటీ డిడిసిఏ స్కాంకు సంబంధించిన విచారణను పూర్తి చేసి 237 పేజీల నివేదికను సమర్పించింది.
అయితే ఈ నివేదికలో కేంద్ర మంత్రి అరుణ్జైట్లీ పేరును ఎక్కడా ప్రస్తావించలేదు. డీడీసీఏ నిర్లక్ష్య వైఖరి, అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలు, క్రీడాకారుల వయసుకు సంబంధించి నకిలీ ధృవీకరణ పత్రాలు మంజూరు చేయటం తదితర అంశాలపై విచారణ కమిటీ ప్రధానంగా దృష్టిసారించింది.
కాగా, ఎక్కడా జైట్లీ పేరును మాత్రం పేర్కొనలేదు. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తోపాటు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కొందరు నేతలు అరుణ్ జైట్లీపై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అరుణ్ జైట్లీ కూడా వారిపై తీవ్ర ఆగ్రం వ్యక్తం చేశారు. అసత్య ఆరోపణలు చేయడం సరికాదన్నారు. సీఎం కేజ్రీవాల్ చేసిన ఆరోపణలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
మెరుగ్గానే భారత పరిస్థితి: జైట్లీ
ఈ యేడాది భారత ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉందని కేంద్ర ఆర్థికశాఖమంత్రి అరుణ్జైట్లీ అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ప్రపంచదేశాల ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉన్నప్పటికీ ఆ ప్రభావం భారత్పై లేదని పేర్కొన్నారు.
అలాంటి పరిస్థితుల్లోనూ భారత్లో ఆర్థిక వృద్ధిరేటు 7-7.5 నమోదుకావడం సంతోషదాయకమని అన్నారు. రాబోయే రోజుల్లో వృద్ధిరేటు మరింత మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కొత్త సంవత్సరంలో ప్రాధాన్యతల ఆధారంగా నిర్మాణాత్మక సంస్కరణలకు శ్రీకారం చుడతామని వివరించారు. ఇందులో జీఎస్టీ కూడా భాగమేనన్నారు. వ్యాపార లావాదేవీలను మరింత సులభతరం చేసేందుకు ప్రత్యక్ష పన్నులను హేతుబద్దీకరిస్తామన్నారు.