పాక్ కావాలో మేం కావాలో తేల్చుకోండి: చైనాకు బీజేపీ 'బిజినెస్' హెచ్చరిక
న్యూఢిల్లీ: ఉగ్రవాదం, ద్వైపాక్షిక బంధం ఒకే మార్గంలో ప్రయాణించలేవని, భారత్ - పాకిస్థాన్ దేశాల్లో ఎవరు కావాలన్నది చైనా తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని బీజేపీ అధికార ప్రతినిధి నళిన్ కోహ్లీ వ్యాఖ్యానించారు.
సాంకేతిక కారణాలు చూపిస్తూ జైష్ ఏ మహ్మమ్మద్ చీఫ్ మసూద్ అజహర్ను ఉగ్రవాదిగా ప్రకటించకుండా ఐక్య రాజ్య సమితిని చైనా తన వీటో హక్కుతో అడ్డుకున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. ఉగ్రవాదంపై పోరాడుతున్న భారత్తో ద్వైపాక్షిక బంధం కావాలో లేదా ఉగ్రవాదానికి మద్దతిస్తున్న పాక్తో చెలిమే కావాలో చైనా నిర్ణయించుకోవాలని చెప్పారు.
పాకిస్తాన్తో బంధాన్ని కొనసాగించాలని భావిస్తే అది భారత్ - చైనా మధ్య ఉన్న బలమైన వ్యాపార బంధం తెగేందుకు కారణమవుతుందని గమనించాలని హెచ్చరించారు.
కాగా, పాకిస్థాన్కు చెందిన ఉగ్రవాది, జైష్ ఏ మహ్మద్ అధినేత మసూద్ అజహర్ను ఐరాస నిషేధించాలన్న భారత్ ప్రతిపాదనకు తాము అడ్డుపడుతుండడాన్ని చైనా సమర్థించుకొంది. సంబంధిత పక్షాల మధ్య సంప్రదింపులు జరగడానికి మరింత సమయం లభించేలా చూడడమే తమ ప్రయత్నం వెనుక ఉద్దేశమని చెప్పింది.
పీటీఐ వార్తా సంస్థకు శనివారం ఈ మేరకు చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ రాతపూర్వకంగా సమాధానం ఇచ్చింది. అజహర్పై మార్చిలో భారత్ చేసిన దరఖాస్తు విషయంలో ప్రపంచ దేశాల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయని చైనా పేర్కొంది.
ఇదిలా ఉండగా, విశ్వసనీయత లేని పాకిస్థాన్ ఇతర ప్రాంతాలపై ఆధిపత్యం సంపాదించడం కోసం ఏమాత్రం గౌరవం చూపకుండా అంతర్జాతీయ వేదికలను దుర్వినియోగం చేస్తోందని భారత్ విమర్శించింది.
కాశ్మీర్లో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని భద్రతా సమితి చేసిన తీర్మానాలు అమలు కాకపోవడం ఐక్యరాజ్యసమితి వైఫల్యమంటూ శుక్రవారం ఐరాసలో పాక్ రాయబారి మలీలా లోఢి చేసిన విమర్శలకు గట్టిగా సమాధానమిచ్చింది.
సమాధానం చెప్పే హక్కును ఉపయోగించుకుంటూ ఐరాసలో భారత్ శాశ్వత బృందం ప్రతినిధి శ్రీనివాస్ ప్రసాద్ ధీటుగా జవాబిచ్చారు. ప్రత్యేక రాజకీయ, వలసవాద నిరోధక కమిటీ సమావేశంలో జరిగిన చర్చలో శ్రీనివాస్ ప్రసాద్ పాకిస్తాన్ ఆరోపణలకు సమాధానమిచ్చారు.
వలసవాదం, స్వయం పాలన లేని ప్రాంతాలపై చర్చించడమే ఈ సమావేశం అజెండా అని, కాశ్మీర్ కాదని స్పష్టం చేశారు. కాశ్మీర్ భారత్లో అంతర్భాగమని, కమిటీ అజెండాను పాకిస్తాన్ గౌరవించాల్సి ఉందన్నారు. స్వార్థం కోసమే సంబంధంలేని విషయాలను ప్రస్తావిస్తోందని ధ్వజమెత్తారు.