తప్పు చేయలేదు, రాజీనామా చేయరు: వెంకయ్య
న్యూఢిల్లీ: తమ మంత్రులెవరూ ఏ తప్పూ చేయలేదని, ఎవరు రాజీనామా చేసే ప్రసక్తే లేదని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో సోమవారం ప్రధాని నరేంద్ర మోడీ అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో విపక్ష నేతలు పాల్గొన్నారు.
సమావేశంలో విపక్ష నేతలు ఇటీవల లలిత్ మోడీ గేట్కు సంబంధించి వార్తల్లో నిలిచిన కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ సిఎం వసుంధర రాజే, విద్యార్హతల గురించి తప్పుడు సమాచారం ఇచ్చిన మరో కేంద్రమంత్రి స్మృతి ఇరానీలను వెంటనే రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు.
లేదంటే వారిపై ప్రత్యేక దర్యాప్తు జరిపించాలన్నారు. వారు అవినీతికి పాల్పడినా ఎందుకు పట్టించుకోవడం లేదనే ప్రశ్నను లేవనెత్తారు. దీనిపై స్పందించిన వెంకయ్యనాయుడు తమ మంత్రులు ఎవరూ ఏ తప్పు చేయలేదని గట్టిగా సమర్థించారు.
చట్ట విరుద్ధమైన పనులుగానీ, అవినీతికిగానీ వారు పాల్పడలేదని తెలిపారు. అందువల్ల వారి రాజీనామా అనే ప్రశ్నకు తావే లేదని స్పష్టం చేశారు. అనవసరంగా సభా సమయాన్ని వృథా చేయొద్దని విపక్షాలకు పిలుపునిచ్చారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభంకానున్నాయి.
సమావేశాలు సజావుగా నిర్వహించేందుకు సిద్ధం
పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అన్ని అంశాలపైనా చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా సోమవారం లోకసభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.
పార్లమెంటు సమావేశాలు సజావుగా జరిగేందుకు అన్ని పార్టీలు సహకరించాలని ప్రధాని మోడీ కోరారు. సమావేశాల్లో అన్ని అంశాలనూ చర్చించేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉందన్నారు. ప్రతి అంశాన్ని సవ్యదిశలో చర్చించి సానుకూల నిర్ణయాలు తీసుకునేందుకు ప్రతిపక్షాలు సహకరించాల్సిన అవసరం ఉందన్నారు.