అబ్బే.. మోడీ ప్రభావం ఏమీ లేదు.. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచినా.. సీపీఐ ఎంఎల్ నేత సంచలనం
బీహర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయదుందుబి మోగించింది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అవతరించింది. ఇందుకు కారణం.. ఎవరూ ఔనన్నా.. కాదన్నా... ప్రధాని నరేంద్ర మోడీ.. కానీ సీపీఐ ఎంఎల్ మాత్రం మోడీ ప్రభ పనిచేయలేదని తెలిపింది. కౌంటింగ్ ముగిసినా.. మహా గట్ బందన్ నేతల్లో విశ్వాసం మాత్రం సన్నగిల్లడం లేదు.
ఎన్నికల్లో మత ప్రచారం పనిచేసిందని సీపీఐ ఎంఎల్ నేత దీపాంకర్ భట్టాచార్య అన్నారు. మోడీ ప్రభావం ఎంతమాత్రం పనిచేయలేదని చెప్పారు. దీంతోపాటు బీహర్ ప్రజలు నితీశ్ కుమార్పై కోపంతో ఉన్నారని తెలిపారు. అందుకు బీజేపీ కూడా కారణం అని ఆరోపించారు.
జేడీయూ భాగస్వామ్యం పార్టీ అయినందున ప్రజా వ్యతిరేకతకు కారణం అవుతోందని తెలిపారు. లాక్ డౌన్ సమయంలో నితీశ్ సర్కార్ అనుసరించిన విధానాన్ని ప్రజలు మరచిపోలేరని తెలిపారు. ప్రజలను ప్రభుత్వం గాలికి వదిలేసిందని తెలిపారు. కానీ తాము మాత్రం ప్రజల పక్షాన నిలబడ్డామని వివరించారు.
బీహర్లో మహాగట్ బంధన్ అధికారానికి దూరమైపోయింది. తొలుత లీడ్ కనిపించినా.. తర్వాత సమానంగా వెళ్లింది. చివరికీ ఎన్డీఏ కూటమి మాత్రం విజయం సాధించింది. అయితే దీనిపై మోడీ ప్రభ లేదని భట్టాచార్య అనడం కలకల రేపింది. బీజేపీ, జేడీయూ కూడా మోడీ పేరు చెప్పి మరీ ప్రచారం చేసింది. నితీశ్ కుమార్ కూడా మోడీ పేరును పదే పదే ప్రస్తావించారు. చివరి అస్త్రంగా ఇవే చివరి ఎన్నికలు అని కూడా చెప్పారు. అయినప్పటికీ ప్రజలు నితీశ్-బీజేపీ వెంట నిలిచారు. కానీ భట్టాచార్య మాత్రం విరుద్దంగా ఆరోపణలు చేస్తున్నారు.