పెళ్లి చేయాలనుకుంటున్నారా? అయితే షరతులు వర్తిస్తాయి..
ఢిల్లీ : పెళ్లి.. జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేని మధురానుభూతి. అందుకే ఆకాశమంత పందిరి, భూదేవంత అరుగు వేసి అంగరంగ వైభవంగా వేడుక జరుపుకుంటారు. తమ తాహతుకు తగ్గట్లుగా లక్షల నుంచి కోట్ల రూపాయలు ఖర్చు చేసి వేడుకలు నిర్వహిస్తారు. అయితే ఇకపై ఇదంతా కుదరదంటోంది ఢిల్లీ సర్కారు. పెళ్లికి ఎంత మందిని పిలవాలో, అతిథులకు ఏం వడ్డించాలో, మిగిలిన పదార్థాలను ఏం చేయాలో అన్నీ తామే చెబుతామని అంటోంది. నిబంధనలు పాటించని వారికి భారీ జరిమానా విధిస్తామని చెబుతోంది. ఈ మేరకు ముసాయిదాను సిద్ధం చేసింది ఢిల్లీ ప్రభుత్వం.
సుప్రీంకోర్టు సూచనతో
కోట్లు ఖర్చు పెట్టి అట్టహాసంగా చేసే పెళ్లి వేడుకల వల్ల పలు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నది సామాజికవేత్తల ఆందోళన. ఆహారం వృథా కావడంతో పాటు పెళ్లి వేడుకల్లో ఉపయోగించే వస్తువుల వల్ల పర్యావరణానికి హాని కలుగుతోందని వారు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఢిల్లీలో వేడుకల నిర్వాహణకు సంబంధించి నియమ నిబంధనలు రూపొందించాలని గతేడాది డిసెంబర్లో ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వుల మేరకు ఢిల్లీ సర్కారు పాలసీ ఫర్ హోల్డింగ్ సోషల్ ఫంక్షన్స్ ఇన్ హోటల్స్, మోటల్స్, అండ్ లో డెన్సిటీ రెసిడెన్షియల్ ఏరియా ఇన్ నేషనల్ కేపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ పేరుతో డ్రాఫ్ట్ రూపొందించింది. దీనికి సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ఆమోదం కూడా తెలిపింది.
ఫంక్షన్ హాల్ యాజమాన్యాలదే బాధ్యత
కొత్త ముసాయిదా ప్రకారం హోటళ్లు, ఫంక్షన్ హాల్ యాజమాన్యాలు, కేటరర్లు, నిర్వాహకులు ఆరోగ్య, కుటుంబసంక్షేమ శాఖకు చెందిన ఆహార భద్రత విభాగం నుంచి పర్మిషన్ తీసుకోవాలి. అలాంటి వారే వేడుకలకు భోజనాలు తయారు చేయడం, సరఫరా చేయడం చేయాలి. పెళ్లిళ్లు, వేడుకల్లో మిగిలిపోయే ఆహారాన్ని ఎన్జీవో ద్వారా అవసరమైనవారికి పంచిపెట్టాలి. ఇందుకోసం కేటరర్లు, హోటల్, ఫంక్షన్ హాల్ యాజమాన్యాలు ఎన్జీఓల వద్ద పేర్లు నమోదుచేసుకోవాలి. ఆ ఆహారాన్ని పార్శిళ్లు, డబ్బాల్లో మాత్రమే అందజేయాలి.
విస్తీర్ణాన్ని బట్టి అతిథులు
వేడుక నిర్వహించే ప్రాంతం విస్తీర్ణాన్ని బట్టి అతిథులను పిలవాల్సి ఉంటుంది. ఎంతమందిని పిలవాలన్నది స్థానిక సంస్థలు నిర్ణయిస్తాయి. ఈ పరిమితికి మించి అతిథులను పిలవడానికి వీల్లేదు. ఫంక్షన్ హాల్ పార్కింగ్ ప్లేస్లో ఎన్ని కార్లు నిలిపే అవకాశముందో దాన్ని నాలుగుతో గుణించి అంతమంది అతిథులను మాత్రమే ఇన్వైట్ చేయాలి. లేదా హాలు విస్తీర్ణాన్ని 1.5చదరపు మీటర్లతో భాగిస్తే ఎంత సంఖ్య వస్తుందో అంతమందినే పిలవాల్సి ఉంటుంది. ఈ రెండింటిలో ఏది తక్కువైతే దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఇక ఎంతమంది అతిథులను పిలుస్తామో వారికి సరిపడేంత ఆహారం మాత్రమే సిద్ధం చేయాలి. ఒకవేళ ఆహారం మిగిలిపోతే వేడుక పూర్తైన వెంటనే మిగిలిన పదార్థాలను హాలు యాజమాన్యం ఎన్జీఓలకు అందజేయాలి.
నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ ఫైన్
వేడుకలు నిర్వహించే వారు పర్యావరణానికి ఏ విధంగా ముప్పు వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వేడుకల కోసం పాక్షిక, శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదు. హాలు బయట వాహనాలు నిలపకూడదు. నీటిని పొదుపుగా వాడటంతో పాటు చెత్తను ఎక్కడపడితే అక్కడ పారేయకూడదు. ఈ నిబంధనలు పాటించని వారికి ప్రభుత్వం రూ.15లక్షల వరకు జరిమానా విధించే అవకాశముంది. ఈ మొత్తాన్ని ఫంక్షన్ హాళ్ల యాజమాన్యాలే కట్టాల్సి ఉంటుందని ముసాయిదాలో స్పష్టం చేశారు.