పార్లమెంట్ క్యాంటీన్లో ఇకపై వెజ్ మెనూ మాత్రమే.. త్వరలో కొత్త క్యాటరర్స్..?
దేశ రాజధాని న్యూఢిల్లీలోని భారత పార్లమెంటు క్యాంటీన్లో ఇకపై నాన్వెజ్ ఐటెమ్స్ ఉండకపోవచ్చు. ప్రస్తుతం పార్లమెంట్ క్యాంటీన్లో క్యాటరర్గా వ్యవహరిస్తున్న ఐఆర్సీటీసీ స్థానంలో.. హల్దీరామ్ లేదా బికనీర్వాలాను క్యాటరర్స్గా నియమించే అవకాశం ఉంది. ఇవి రెండు పూర్తి శాఖాహార క్యాటరర్స్ కావడంతో.. క్యాంటీన్ మెనూలో కేవలం వెజ్ ఐటెమ్స్ మాత్రమే ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం పార్లమెంటు ఆవరణలో ఉన్న ఐదు క్యాంటీన్ల మెనూలో బిర్యానీ,చికెన్ కట్లెట్స్,ఫిష్ వంటి ఐటెమ్స్కు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ మెనూ స్థానంలో పూర్తి వెజ్ మెనూని తీసుకొస్తే.. అది వివాదానికి దారితీసే అవకాశం లేకపోలేదు.
ఐఆర్సీటీసీ స్థానంలో కొత్త క్యాటరర్..
ఐఆర్సీటీసీ స్థానంలో తాజా క్యాంటీన్ కాంట్రాక్టును హల్దీరామ్ లేదా బికనీర్వాలాకు ఇచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఓ థర్డ్ పార్టీ కంపెనీ తెలిపింది. అయితే కాంట్రాక్టు విషయంలో ఫుడ్ కమిటీ గైర్హాజరీలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నిర్ణయం తీసుకున్నారని.. ఏదేమైనా హల్దీరామ్ లేదా బికనీర్వాలా కంపెనీల్లో ఒకదానికి క్యాంటీన్ కాంట్రాక్టు దక్కవచ్చునని చెప్పారు.
ధరల సవరణ కూడా..
గత కొన్ని నెలలుగా క్యాంటీన్లో వడ్డించే ఆహార నాణ్యతతో పాటు పార్లమెంటు సభ్యులకు ఇచ్చే సబ్సిడీలపై ఐఆర్సిటిసి ఫిర్యాదులను ఎదుర్కొంది. ఇది కొత్త క్యాటరర్ డిమాండ్కు దారితీసింది. వచ్చే బడ్జెట్ సమావేశాల సందర్భంగా నిర్వహించే బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో కొత్త క్యాటరర్ నియామకంపై చర్చించే అవకాశం ఉంది. అలాగే క్యాంటీన్ మెనూ ధరలు అతి చౌకగా ఉండటం తరుచూ విమర్శలకు గురవుతుండటంతో.. ధరలను సవరించే అవకాశం కూడా ఉంది.
సబ్సిడీ వదులుకున్న ఎంపీలు
చివరిసారిగా 2016లో పార్లమెంట్ క్యాంటీన్ ధరలను సవరించారు. అప్పటివరకు 80శాతం సబ్సిడీపై ఆహార పదార్థాలను అందించడం విమర్శలకు దారితీయడంతో ధరల సవరణ తప్పలేదు. గతేడాది జరిగిన పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో సబ్సిడీని వదులుకునేందుకు ఎంపీలంతా ఒప్పుకున్నారు.
వాళ్లను మినహాయించాలంటున్న కొంతమంది ఎంపీలు
పార్లమెంటు వార్షిక ఆహార ఖర్చులు రూ .17 కోట్లు, ఇందులో పెద్ద మొత్తంలో సబ్సిడీ ఉంటుంది. రూ .17 కోట్లలో కనీసం రూ .14 కోట్లు పార్లమెంటు సిబ్బంది, సందర్శకులు, ఎంపీలపై ఖర్చు అవుతున్నదే. అయితే సబ్సిడీని పూర్తి ఎత్తివేయడం సబబు కాదని కొంతమంది ఎంపీలు అభ్యంతరం తెలుపుతున్నారు. క్యాంటీన్ ఆహార పదార్థాలపై సబ్సిడీని ఎత్తివేయడం పార్లమెంట్ సిబ్బందిపై తీవ్ర ప్రభావం చూపుతుందంటున్నారు. ఎంపీల కంటే తరుచుగా సిబ్బందే అక్కడ భోజనం చేస్తారని గుర్తుచేస్తున్నారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి కూడా ఇదే అభిప్రాయపడ్డారు.