పాక్ కు టమాట, కారం దెబ్బ: కూరగాయలు ఇవ్వం
అహమ్మదాబాద్: పాకిస్థాన్ కొవ్వు దించడానికి మన వ్యాపారులు తగిన బుద్ధి చెబుతున్నారు. భారత్-పాక్ సరిహద్దుల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో పాకిస్థాన్ పై కూరగాయల నిరాకరణ ఉద్యమానికి నాందీ పలికారు. గుజరాత్ నుంచి టమాట, కారం, కూరగాయల ఎగుమతిని పూర్తిగా నిలిపివేశారు.
పాక్ కు కూరగాయలు ఎగుమతి చెయ్యరాదని గుజరాత్ వ్యాపారులు నిర్ణయించారు. పాకిస్థాన్ లో కూర ఉడకాలంటే గుజరాత్ నుంచి టమాట, కారం వెళ్లాల్సిందే. ప్రతి రోజు గుజరాత్ నుంచి పాకిస్థాన్ లోని వాఘా సరిహద్దు వరకు 50 ట్రక్కుల్లో 10 టన్నుల కూరగాయలు వెలుతుంటాయి.
ఊరీ ఘటనతో భారత సైన్యం పాక్ అక్రమిత కాశ్మీర్ లో సర్జికల్ స్ట్రైక్ దాడులు చేసి ప్రతీకారం తీర్చుకున్న తరువాత ఇండో-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయినా పాక్ కు బుద్దిరాకపోవడంతో వారి ఆట కట్టించడానికి కూరగాయల నిరాకరణ ఉద్యమం చేపట్టాలని గుజరాత్ వ్యాపారులు నిర్ణయించారు.
గత మూడు రోజుల నుంచి కూరగాయలు ఎగుమతి చెయ్యకపోవడంతో పాక్ ప్రజలు అల్లాడిపోతున్నారు. పాకిస్థాన్ లో కూరగాయాలకు ఎక్కువ డిమాండ్ ఉంది. ఇప్పుడు కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోయాయి.
పాక్ కు కూరగాయలు ఎగుమతి చెయ్యకపోవడంతో ప్రతి రోజు గుజరాత్ రైతులు, వ్యాపారులు రూ. మూడు కోట్ల వరకు నష్టపోతున్నారు. అయితే వ్యక్తిగత స్వలాభం కన్నా జాతి ప్రయోజనాలే మాకు ముఖ్యమని వ్యాపారులు చెప్పారు.
అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని గుజరాత్ ట్రేడ్ అసోసియేషన్ సెక్రటరీ అహమ్మద్ పటేల్ అంటున్నారు. గల్ఫ్ దేశాలు, కెనడా, సౌత్ ఆఫ్రికా, బంగ్లాదేశ్ తదితర దేశాలకు మాత్రం యథావిధిగా కూరగాయల ఎగుమతులు కొనసాగుతున్నాయని ఆయన వివరించారు.