మహాత్మా గాంధీ హత్య కేసులో మళ్లీ దర్యాఫ్తు అవసరం లేదు'
న్యూఢిల్లీ: మహాత్మా గాంధీ హత్య కేసును తిరిగి దర్యాఫ్తు చేయాల్సిన అవసరం లేదని ఈ కేసుపై అమికస్ క్యూరీ (న్యాయ సహాయకుడు)గా ఉన్న సీనియర్ న్యాయవాది అమరేందర్ శరణ్ తెలిపారు. ఈ మేరకు తన అభిప్రాయం ఆయన సుప్రీం కోర్టుకు నివేదించారు.
నివేదికను పరిశీలించిన జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారణను ఈ నెల 12కు వాయిదా వేసింది. గాంధీజీ హత్య హత్య కుట్రలో మూడో వ్యక్తి ప్రమేయం ఉందంటూ ముంబైకి చెందిన పరిశోధకుడు పంకజ్ ఫడ్నవీస్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఈ కేసును మళ్లీ విచారించాలని కోరారు. దీనిపై గతేడాది అక్టోబరులో విచారణ చేపట్టిన న్యాయస్థానం ఆ మూడో వ్యక్తి జీవించి ఉన్నాడో లేదో చెప్పాలని పిటిషనర్కు సూచించింది. ఈ కేసులో న్యాయసలహా కోరుతూ అమరేందర్ శరణ్ను అమికస్ క్యూరీగా నియమించింది.
ఈ కేసుపై పరిశోధన చేపట్టిన శరణ్ సోమవారం తన నివేదికను ఇచ్చారు. గాంధీజీ శరీరంలో దొరికిన బుల్లెట్లు, అవి కాల్చిన పిస్టోల్, హంతకుడు, హత్యకు కుట్ర వీటిని పరిశీలిస్తే ఎలాంటి అనుమానం రావడం లేదని, గాడ్సే కాకుండా మరో వ్యక్తి గాంధీపై కాల్పులు జరిపాడనేదానిపై ఎలాంటి ఆధారాలు, సాక్ష్యాలు లేవని, దీనిపై మరోసారి దర్యాప్తు జరపాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.