మీరా మాట్లాడేది?: యూన్హెచ్ఆర్సీలో పాక్ను చీల్చిచెండాడిన భారత్
జెనీవా: కాశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్యసమితిలో లేవనెత్తిన దయాది దేశం పాకిస్థాన్ను అక్కడే చీల్చి చెండాడింది భారత్. అంతర్జాతీయ ఉగ్రవాదానికి మూల కేంద్రంగా ఏ దేశం నిలుస్తుందో అందరికీ తెలుసని, వాళ్లే ఇప్పుడు జమ్మూకాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడింది.
ఐక్యరాజ్యసమితి మానవహక్కుల మండలి(యూఎన్హెచ్ఆర్సీ)లో భారత్ తరపున హోంమంత్రిత్వ శాఖ సెక్రటరీ(ఈస్ట్) విజయ్ ఠాకూర్ సింగ్ మంగళవారం ప్రసంగించారు. జమ్మూకాశ్మీర్ అంశం అంతర్జాతీయ అంశమని, భారత అంతర్గత వ్యవహారం కాదని పాక్ విదేశాంగశాఖ మంత్రి షా మహమూద్ ఖురేషి చేసిన వ్యాఖ్యలను విజయ్ ఠాకూర్ తిప్పికొట్టారు.
భారత ప్రభుత్వం తీసుకున్న సార్వభౌమాధికార నిర్ణయాలు పూర్తిగా తమ దేశ అంతర్గత వ్యవహారమని ఠాకూర్ స్పష్టం చేశారు. పార్లమెంటులో ఆమోదించిన ఇతర నిర్ణయాల తరహాలోనే కాశ్మీర్ విషయంలో పార్లమెంటు తీసుకున్న నిర్ణయం పూర్తిగా భారతదేశం అంతర్గత విషయమని, వాటిలో ఏ దేశ ప్రమేయాన్ని అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అంతేగాక, కాశ్మీర్లో ప్రగతి శీల విధానాలను అమలు చేయనున్నామని తెలిపారు.
కాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయంటూ పాక్ పూర్తిగా తప్పుడు కథనాలు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. అంతర్జాతీయ ఉగ్రవాదానికి ఎవరు కేంద్రంగా ఉన్నారో ప్రపంచానికి తెలుసని పాకిస్థాన్కు చురకలంటించారు. ఉగ్రవాదులకు ఆశ్రయం, నిధులు అందించడం ఎవరు చేస్తున్నారో ప్రపంచ దేశాలకు తెలుసని ధ్వజమెత్తారు.
ఇక ఎన్ఆర్సీ గురించి మాట్లాడుతూ.. ఎన్ఆర్సీ చట్టబద్దత ఉందని, పారదర్శకంగా, వివక్షరహితంగా పక్రియ ఉంటుందని.. సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే ఈ ప్రక్రియ జరుగుతోందని విజయ్ ఠాకూర్ సింగ్ వివరించారు. భారతీయ చట్టాలు, ప్రజాస్వామ్య సంప్రదాయాలకు అనుగుణంగానే తమ నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేశారు. కాగా, భారత్ ఇచ్చిన సుదీర్ఘ, సునిశిత జవాబుతో పాక్ దిమ్మతిరిగిపోయింది.