ఆరోగ్యంగా ఉన్నా: డాక్టర్తో మెమెన్, గుడ్బై చెప్పాడు
నాగపూర్: ముంబై పేలుళ్ల కేసులో దోషి యాకుబ్ మెమెన్ను గురువారం ఉదయం మహారాష్ట్రలోని నాగపూర్ జైలులో ఉరిశిక్షను అమలు చేశారు. ఉరిశిక్ష అమలుకు ముందు వైద్యులు మెమెన్ను పరీక్షించారు.
ఈ సమయంలో యాకూబ్ మెమెన్ వైద్యులతో... నేను బాగానే ఉన్నానని, తనను పరీక్షించవలసిన అవసరం లేదని చెప్పాడు. నిబంధనల ప్రకారం మెడికల్ ఆఫీసర్ ఉరిశిక్ష అమలు చేయబోయే ముందు పరీక్షలు నిర్వహిస్తారు.
తాను ఆరోగ్యంగా ఉన్నానని మెమెన్ చెప్పినప్పటికీ, నిబంధనల మేరకు మెడికల్ ఆఫీసర్ అతనిని పరీక్షించారు. పరీక్షించినప్పుడు మెమెన్ ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు చెప్పారు.
న్యాయం జరగలేదని భావించిన మెమెన్
తనకు న్యాయం జరగలేదని యాకూబ్ మెమెన్ భావించినట్లుగా తెలుస్తోంది. సుప్రీం కోర్టు తన పైన కఠినంగా వ్యవహరించిందని భావించాడు.
గుడ్ బై
పలువురు జైలు అధికారులకు, పోలీసులకు అతను చివరగా గుడ్ బై చెప్పాడు. అతను బుధవారం రాత్రి వారికి గుడ్ బై చెప్పాడు. సుప్రీం కోర్టులో మెమెన్కు అనుకూలంగా తీర్పు ఉంటుందని కుటుంబ సభ్యులు మాత్రమే భావించారట. కానీ యాకూబ్ మెమెన్ మాత్రం అంతా అయిపోయిందని అప్పటికే నిర్ణయించుకున్నాడు.
మృతదేహం అప్పగింతపై వాదనలు
యాకూబ్ మెమెన్ మృతదేహం అప్పగింత పైన అతని కుటుంబ సభ్యులు వాదించారని తెలుస్తోంది. నిబంధనల ప్రకారం జైలులోనే అతనిని ఖననం చేస్తామని అధికారులు చెప్పారు. అయితే, తమకు మృతదేహాన్ని అప్పగించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.
తమకు మృతదేహం అప్పగించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగవని వారు అధికారులకు హామీ ఇచ్చారు. ఈ విషయమై జైలు అధికారులు మహారాష్ట్ర ప్రభుత్వం నుండి అనుమతి తీసుకొని, మృతదేహాన్ని అప్పగించేందుకు నిర్ణయించారు.