పాత కేసుల విచారణలో రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి అక్కర్లేదు: కేంద్రం
ఢిల్లీ: పాత కేసుల విచారణకు ఆయా రాష్ట్రాల అనుమతి అవసరం లేదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. సీబీఐ ఆయా రాష్ట్రాల్లో కేసులను విచారణ చేస్తున్న నేపథ్యంలో అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డుపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సీబీఐ పరిధిపై మరోసారి కేంద్రం స్పష్టత ఇచ్చింది. ఇప్పటికే సీబీఐ విచారణ చేస్తున్న కేసుల విషయంలో అధికారులను అడ్డుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని తేల్చి చెప్పింది కేంద్రం.
ఢిల్లీ పోలీసు చట్టంలో కేంద్రం చేసిన సవరణలను ఈ సందర్భంగా ప్రస్తావించింది. కేసుల దర్యాప్తు విషయంలో ఇటు కేంద్రపాలిత ప్రాంతాల్లో కానీ, అటు రాష్ట్రాల్లో కానీ సీబీఐకు దర్యాప్తు చేసే అధికారం ఉందని స్పష్టం చేసింది. ఢిల్లీ పోలీసు చట్టం కింద ఏ దర్యాప్తుకైనా ప్రత్యేక విచారణ సంస్థను ఏర్పాటు చేసే అధికారం కేంద్రానికి ఉందని తెలిపింది.
సెక్షన్ -3 కింద పొందుపరిచిన నేరాలకు మాత్రమే పరిమితం కాకుండా సెక్షన్ -5లోని అంశాలను కూడా దర్యాప్తు చేసే అధికారం సీబీఐకి ఉంటుంది. ఇక ఓ కేసుకు సంబంధించి న్యాయస్థానాలు సీబీఐ విచారణకు ఆదేశిస్తే ఆ విచారణను అడ్డుకునే అధికారం ఏ రాష్ట్ర ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పింది. సీబీఐ స్వతంత్ర సంస్థ అని చెప్పిన కేంద్రం.... కేసులను స్వేచ్ఛగా దర్యాప్తు చేసే హక్కు అధికారం సీబీఐకి ఉందని గుర్తుచేసింది.
ఇదిలా ఉంటే ఈ మధ్యే పశ్చిమ బెంగాల్లో జరిగిన శారదా చిట్ ఫండ్ కుంభకోణంకు సంబంధించి ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను సిట్ అధికారిగా ఉన్న కోల్కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ ధ్వంసం చేశారన్న ఆరోపణలపై ఆయన్ను విచారణ చేసేందుకు వెళ్లిన సీబీఐ అధికారులను ఆ రాష్ట్ర పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీనే రాజీవ్కుమార్కు రక్షణగా నిలిచారు. సీబీఐకి వ్యతిరేకంగా నిరసన చేపట్టడం దేశం దృష్టిని మరల్చింది. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ గడ్డపై సీబీఐ అడుగుపెట్టరాదంటూ ఏపీ సర్కార్ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో కేంద్రం మరోసారి సీబీఐ పరిధిని స్పష్టం చేసింది.