భారీ ఊరట: కేసు పూర్తయ్యేంత వరకు నో డెడ్లైన్, ఆధార్పై తేల్చేసిన సుప్రీం!
న్యూఢిల్లీ: ఆధార్ అనుసంధానంపై ప్రజలకు భారీ ఊరట లభించింది. వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, బ్యాంకు ఖాతాలు, మొబైల్ సేవలు తదితరాలకు ఆధార్ అనుసంధానం గడువు ఈ మార్చి 31తో ముగియనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఆధార్ అనుసంధానం గడువును ఇప్పుడు దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు నిరవధికంగా వాయిదా వేసింది.
చదవండి: షాకింగ్: వేలాది ఆధార్ కార్డులు.. పాడుబడ్డ బావిలో, ఎవరివి.. అసలేం జరిగింది?
చీఫ్ జస్టిస్ దీపాక్ మిశ్రా నేతృత్వంలోని జస్టిస్ ఎకె సిక్రీ, ఎఎం ఖాన్విల్కర్, డీవై చంద్రచూడ్, అశోక్ భూషణ్తో కూడిన ఐదుగురు న్యాయనిర్ణేతల రాజ్యాంగ ధర్మాసనం దీనిపై తుది విచారణ పూర్తయ్యేంతవరకు ఎలాంటి డెడ్లైన్ లేదని తేల్చి చెప్పింది. అసలు బ్యాంకు ఖాతాలు, మొబైల్ లాంటి సేవలకు ఆధార్ లింకింగ్ తప్పనిసరి కాదని పేర్కొంది.
ఆధార్ మాండేటరీ, ఆధార్ గోప్యత అంశాలకు సంబంధించి పలు పిటీషన్లపై విచారించిన సుప్రీం ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు బ్యాంకు ఖాతా, మొబైల్, తత్కాల్ పాస్పోర్ట్ లాంటి సేవలకు ప్రత్యేక ఐడెంటిఫికేషన్ నంబర్ ఆధార్ తప్పనిసరి కాదని స్పష్టం చేసింది.
కేవలం ప్రభుత్వ సంక్షేమ పథకాలకు మాత్రమే ఆధార్ అవసరమవుతుందని బెంచ్ పేర్కొంది. ప్రభుత్వ సేవలు పొందడానికి ఆధార్ కచ్చితమా? లేదా? అనే అంశంపై పలు స్వచ్ఛంద సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లపై ప్రస్తుతం సుప్రీం కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి.
ఈ నేపథ్యంలో సుప్రీం సూచనల మేరకు ఆధార్ అనుసంధానం గడువును కేంద్రం పలుమార్లు పొడిగించింది. ఇప్పుడు ఏకంగా ఈ కేసు విచారణ పూర్తయ్యేంత వరకు గడువును పొడిగించాలంటూ సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది.