కాశ్మీర్లో 10వేలమంది పారామిలిటరీ దళాలు, యుద్ధవిమానాల చక్కర్లు: గవర్నర్ ఏం చెప్పారంటే
శ్రీనగర్: పుల్వామా దాడి అనంతరం కాశ్మీర్లో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. హురియత్ కాన్ఫరెన్స్ నేతలకు కొద్ది రోజుల క్రితమే భద్రతను ఉపసంహరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరోవైపు, 35ఏ అధికరణపై సోమవారం సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా కేంద్రం జాగ్రత్తలు తీసుకుంటోంది.
కాశ్మీర్లో చక్కర్లు కొట్టిన యుద్ధ విమానాలు
ఇందులో భాగంగా శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఆ రాష్ట్రంలో 130 మంది వేర్పాటువాదులను ప్రభుత్వం అదుపులోకి తీసుకుంది. కాశ్మీర్ లోయలో అదనంగా దాదాపు 10 వేల మంది పారా మిలటరీ దళాలను ప్రభుత్వం మోహరించింది. శ్రీనగర్లో శనివారం యుద్ధ విమానాలు పదేపదే ఆకాశంలో చక్కెర్లు కొట్టాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు చర్యలతో యుద్ధ భయం నెలకొంది. దీంతో కాశ్మీర్లో అనేక చోట్ల అత్యవసర సరకులు, పెట్రోలు కొనుగోలు చేయడానికి జనం బారులు తీరారు. మరోవైపు, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ సోమ, మంగళవారాల్లో త్రివిధ దళాధిపతులతో సమావేశం కానున్నారు.
జమాత్పై తొలిసారి
శుక్రవారం అర్ధరాత్రి దాటాక దాదాపు వేర్పాటువాదులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో జమాత్ ఎ ఇస్లామీ జమ్మూ కాశ్మీర్ అధిపతి హమీద్ ఫయాజ్ సహా ఆ సంస్థ నాయకులు ఎక్కువ మంది ఉన్నారు. హురియత్ కాన్ఫరెన్స్కు చెందిన యాసిన్ మాలిక్నూ అదుపులోకి తీసుకున్నారు. నాయకులు, భద్రతా దళాలపై రాళ్లు రువ్వే వారిని అదుపులోకి తీసుకోవడం సహజమేనని అంటున్నారు. కానీ జమాత్ ఎ ఇస్లామీపై ఈ స్థాయిలో కొరడా ఝళిపించడం ఇదే మొదటిసారని చెబుతున్నారు.
పదివేల మంది జవాన్ల తరలింపు
నేతలను అదుపులోకి తీసుకోవడంతో రాష్ట్రంలో ఉద్రిక్తతలు పెరిగాయి. కొన్ని సంస్థలు కాశ్మీర్ బంద్కు పిలుపునిచ్చాయి. జనం గుమికూడుతున్నారు. దీంతో ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేసింది. కొన్ని ప్రభుత్వ విభాగాలు జారీ చేసిన ఉత్తర్వులు కూడా ప్రజల్లో ఆందోళన పెంచాయి. శ్రీనగర్లోని ప్రభుత్వ వైద్య కళాశాల తన బోధన సిబ్బందికి శీతాకాల సెలవులను రద్దు చేసింది. సోమవారం నుంచి విధుల్లో చేరాలని ఆదేశించింది. ఆహార, పౌర సరఫరాల శాఖ కూడా దక్షిణ శ్రీనగర్లోని తన సిబ్బందిని ఆహార ధాన్యాల విక్రయాన్ని శనివారం సాయంత్రానికి పూర్తి చేయాలని ఆదేశించింది. ఆదివారం కూడా రేషన్ షాపులను తెరిచి ఉంచేలా చూడాలని చెప్పింది. శాంతి భద్రతలు అదుపు తప్పకుండా కాశ్మీర్ లోయలోకి అదనంగా వంద కంపెనీల పారామిలటరీ దళాలను అంటే పదివేల మంది జవాన్లను తరలించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇలా మోహరిస్తున్నట్లు చెబుతున్నారట.
భద్రతా బలగాల మోహరింపుపై గవర్నర్ ఏం చెప్పారంటే
కాశ్మీర్లోని పరిస్థితులను పీడీపీ అధ్యక్షురాలు, మాజీ సీఎం ముఫ్తీ ప్రశ్నించారు. హురియత్ కాన్ఫరెన్స్ చైర్మన్ మిర్వాయిజ్ ఉర్ ఫరూక్ ఈ చర్యలను ఖండించారు. కాశ్మీర్లోని తాజా పరిస్థితులపై రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్ స్పందించారు. ప్రజలు ఎవరూ ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన పని లేదని చెప్పారు. 'ప్రజలు భయపడాల్సిన పని లేదు. రాష్ట్రంలో భయాందోళన పరిస్థితిని, ఉద్రిక్తతలను కల్పించేందుకు కొందరు ఉద్దేశ్యపూర్వకంగా ప్రచారం చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున భారీగా బలహాలను మోహరించారు. త్వరలో కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రానికి రానుంది' అని గవర్నర్ తెలిపారు. ఇటీవల జరుగుతున్న సంఘటనల నేపథ్యంలో వేర్పాటువాదులను అదుపులోకి తీసుకున్నట్లు గవర్నర్ తెలిపారు. ఆర్టికల్ 35ఏ పైన కొందరు దురుద్దేశ్యపూర్వకంగా భయపెట్టేలా ప్రచారం చేస్తున్నారని చెప్పారు. గతంలో కూడా ఇలాంటి విధ్వంసకారుల అరెస్ట్ జరిగిందని చెప్పారు.