గాంధీపై వ్యాఖ్యలు: రైటర్ అరుంధతీ రాయ్పై నో కేసు
తిరువనంతపురం: మహాత్మా గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రముఖ రచయిత్రి అరుంధతీ రాయ్పై కేసు పెట్టాల్సిన అవసరం లేదని కేరళ గాంధీ స్మారక నిధి సంస్థ తెలిపింది. ఆమెపై కేసు పెట్టాలనే పోలీసుల ఆలోచనను సంస్థ వ్యతిరేకించింది. అయితే, అరుంధతీ రాయ్ తన వ్యాఖ్యలపై ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆ సంస్థ సూచించింది.
ప్రజాస్వామ్యంలో అంగీకరించే, వ్యతిరేకించే స్వేచ్ఛ ఉంటుందని కేరళ గాంధీ స్మారక నిధి వర్కింగ్ చైర్మన్ ఎన్ రాధాకృష్ణన్, కార్యదర్శి కెజి జగదీష్ మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. అరుంధతీ రాయ్కు భావ ప్రకటనా స్వేచ్ఛను ఎవరు కూడా కాదనడానికి లేదని భారత గాంధీ అధ్యయన మండలి చైర్మన్ కూడా అయిన రాధాకృష్ణన్ అన్నారు.
కొంత మంది చప్పట్ల కోసం ఏదో ఒకటి మాట్లాడేయడం సరి కాదని ఆయన అన్నారు. గాంధీ విమర్శలకు అతీతుడని తాము అనుకోవడం లేదని కూడా ఆయన అన్నారు. ఆఫ్రికాలో 1894లో ప్రజా జీవితాన్ని ప్రారంభించినప్పటి నుంచి గాంధీ కార్యాలపై విమర్శలు, విభిన్నమైన అంచనాలు వస్తూనే ఉన్నాయని ఆయన అన్నారు.
గాంధీపై విమర్శలు కొత్తవేమీ కావని, అందులో తప్పు కూడా ఏమీ లేదని, అయితే ఆ విమర్శలు చరిత్రను వక్రీకరించే విధంగా ఉండకూడదని ఆయన అన్నారు. గత నెలలో అరుంధతీ రాయ్ కేరళ విశ్వవిద్యాలయంలో చేసిన ప్రసంగం క్లిప్పింగుల కోసం పోలీసులు ప్రయత్నించారు. ఆ వ్యాఖ్యల ఆధారంగా అరుంధతీరాయ్పై కేసు పెట్టవచ్చా లేదా అనేది పరిశీలించడానికి వాటిని తీసుకున్నారు.