సీఏఏ అసెంబ్లీ తీర్మానంపై అజిత్ పవార్ ట్విస్ట్.. శరద్ పవార్కు భిన్నంగా...
మహారాష్ట్రలో సీఏఏ అమలుపై గందరగోళం నెలకొంది. కొలువైంది సంకీర్ణ ప్రభుత్వం కావడంతో.. ఒక్కో పార్టీ నేత ఒక్కోలా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. సీఏఏకి వ్యతిరేకంగా కాంగ్రెస్ మాట్లాడుతుంటే.. శివసేన సీఏఏకి అనుకూలంగా మాట్లాడుతోంది. మరోవైపు దీనిపై భాగస్వామ్య పార్టీలన్నీ చర్చించాలని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కొద్దిరోజుల క్రితం అభిప్రాయపడగా.. ఇప్పుడదే పార్టీ నేత,డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అందుకు భిన్నమైన స్టేట్మెంట్ ఇచ్చారు.
సీఏఏకి వ్యతిరేకంగా కేరళ,పంజాబ్ రాష్ట్రాలు అసెంబ్లీ తీర్మానం చేయడం.. తెలంగాణ కూడా అదే దారిలో పయనిస్తుండటంతో.. మహారాష్ట్రలోనూ దీనికి వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానం చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ మేరకు మహారాష్ట్రలోని పలు గ్రామాల్లో ఇప్పటికే సీఏఏకి వ్యతిరేకంగా తీర్మానాలు కూడా చేశారు. ఇలాంటి తరుణంలో అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ముంబైలో నిర్వహించిన ఎన్సీపీ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
అజిత్ పవార్ ట్విస్ట్
పౌరసత్వ సవరణ చట్టం(CAA),జాతీయ పౌర పట్టిక(NRC)లకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాల్సిన అవసరం లేదని అజిత్ పవార్ అభిప్రాయపడ్డారు. సీఏఏ కారణంగా ఎవరి పౌరసత్వం తొలగించబడదని అన్నారు. సీఏఏ వల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని శరద్ పవార్ భరోసా ఇస్తున్నారని చెప్పారు. దీనిపై మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంతో చర్చలు జరిపామని వెల్లడించారు. అంతేకాదు,బీహార్ ఫార్ములా ఇక్కడ అమలుచేయాల్సిన అవసరం లేదన్నారు. బీజేపీ మిత్రపక్షంగా ఉంటూనే నితీశ్ సర్కార్ సీఏఏకి వ్యతిరేకంగా తీర్మానం చేసిన నేపథ్యంలో అజిత్ పవార్ ఈ కామెంట్స్ చేశారు.
సీఏఏపై వదంతులు అన్న అజిత్..
సీఏఏపై ప్రజలపై కొంతమంది వదంతులు సృష్టిస్తున్నారని.. తాము ప్రజల్లోకి వెళ్లి చైతన్యపరుస్తామని అజిత్ పవార్ తెలిపారు. సీఏఏని పక్కనపెడితే.. 2022లో జరగబోయే బీఎంసీ ఎన్నికల్లో పొత్తులతోనే పోటీ చేస్తామని అజిత్ పవార్ చెప్పారు. మహావికాస్ అఘాడీ ప్రభుత్వం కలిసికట్టుగానే పోటీ చేస్తుందన్నారు. ఎన్సీపీ కార్యకర్తలకు,మద్దతుదారులకు తమ భాగస్వామ్య పార్టీల పట్ల ఎలాంటి అపోహలు లేదా అపార్థాలు ఉండరాదని చెప్పారు. రాబోయే రోజుల్లో కలిసి ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి అలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దన్నారు.
రెండేళ్లలో బీఎంసీ ఎన్నికలు
నెలలో ఒక్కసారైనా ముంబైలో మనమంతా సమావేశం కావాల్సిన అవసరం ఉందని కార్యకర్తలను ఉద్దేశించి అజిత్ పవార్ అన్నారు. ముంబై అభివృద్ది కోసం కలిసి కట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. రెండేళ్లలో బీఎంసీ ఎన్నికలు ఉన్నాయన్న అజిత పవార్.. వాటికోసం ఇప్పటినుంచే సన్నద్దం కావాల్సిన అవసరం ఉందన్నారు. కొంతమంది సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని.. కానీ అది ఎవరివల్ల సాధ్యం కాదని అన్నారు. మహావికాస్ అఘాడీ ప్రభుత్వంలో ఎవరూ ఎవరితో శత్రుత్వం పెట్టుకోవద్దన్నారు. పరస్పర సత్సంబంధాలు నెలకొనేలా చూడాలన్నారు.
ఉద్దవ్కు నచ్చజెపుతామన్న శరద్ పవార్.. ఇంతలోనే..
మహారాష్ట్రలో సీఏఏ అమలుపై కొద్దిరోజుల క్రితం ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే అనుకూల వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ తర్వాత దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు. దీనివల్ల మైనారిటీలు లబ్ది పొందుతారని కూడా చెప్పారు. కానీ శరద్ పవార్ మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించారు. అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం అని, భాగస్వామ్య పార్టీలు చర్చించే అవకాశం ఉందని చెప్పారు. అంతేకాదు,సీఏఏపై ఉద్దవ్కు నచ్చజెప్పే ప్రయత్నం కూడా చేస్తామన్నారు. కానీ ఇంతలోనే అజిత్ పవార్ కూడా సీఏఏకి అనుకూలంగా స్టేట్మెంట్స్ ఇవ్వడం గమనార్హం.