రూ. 2000 నోట్ల ఉపసంహరణ?: ఆందోళన అవసరం లేదన్న కేంద్రమంత్రి
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రూ. 2000 నోటు ఇటీవల కాలంలో ఎక్కువగా ఎక్కడా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో రూ. 2000 నోటును ఉపసంహరించుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రచారంపై పార్లమెంటులో కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ స్పష్టతనిచ్చారు.
మంగళవారం జరిగిన రాజ్యసభ సమావేశంలో సమాజ్వాదీ పార్టీ ఎంపీ విశ్వంబర్ ప్రసాద్ నిషద్ రూ. 2000 నోట్ల అంశాన్ని లేవనెత్తారు. రూ. 2వేల నోట్లు తీసుకొచ్చిన తర్వాత దేశంలో నల్లధనం పెరిగిందని ఆయన ఆరోపించారు. అంతేగాక, రూ. 2వేల నోట్ల స్థానంలో మళ్లీ రూ. 1000 నోట్లను తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు వస్తున్న వార్తల గురించి ప్రశ్నించారు.
రూ. 2000 నోటును ఉపసంహిరంచుకున్నట్లు వస్తున్న వార్తల్లో నిజంలేదని ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ సమాధానమిచ్చారు. ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.
నల్లధనాన్ని అరికట్టడం, నకిలీ కరెన్సీని నిర్మూలించడం, ఉగ్రవాదులు, అతివాదుల ఆర్థిక మార్గాలకు అడ్డుకట్టవేయడం, డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడం తదితర లక్ష్యాలతో పెద్ద నోట్ల రద్దు చేపట్టినట్లు అనురాగ్ ఠాకూర్ వివరించారు. పెద్ద ఎత్తున నకిలీ కరెన్సీ కూడా పట్టుబడిందని ఆయన తెలిపారు.
నవంబర్ 4, 2016లో రూ. 17,741.87 బిలియన్ల నోట్లు సర్క్యూలేషన్లో ఉండగా.. డిసెంబర్ 2, 2019లో అది రూ. 22,356.48 బిలియన్లకు పెరిగిందని వెల్లడించారు. నవంబర్ 2016లో రూ. 1000, రూ. 500 నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే.