హెచ్-1బి వీసా నిబంధనలపై ఐటీ ఇండస్ట్రీ భయపడనక్కర్లేదు : సుష్మా స్వరాజ్
హెచ్-1బీ వీసాలపై తీసుకొచ్చే కఠినతర నిబంధనలకు ఐటీ ఇండస్ట్రీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాజ్యసభలో గురువారం సుష్మా స్వరాజ్ చెప్పారు.
న్యూఢిల్లీ: హెచ్-1బీ వీసాలపై తీసుకొచ్చే కఠినతర నిబంధనలకు ఐటీ ఇండస్ట్రీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం భరోసా ఇస్తోంది. ఈ విషయమై ట్రంప్ కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు భారత ప్రభుత్వం తెలిపింది.
ఐటీ ప్రొఫెషనల్స్ కు జారీ చేసే హెచ్-1బీ, ఎల్-1 వీసాలకు సంబంధించి నాలుగు బిల్లులు అమెరికా కాంగ్రెస్ ముందుకొచ్చాయి. కానీ వాటిని వారు ఆమోదించలేదని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు.
ఐటీ ఇండస్ట్రీ, భారతీయు ప్రజలు ప్రభావితం కాకుండా అమెరికాలో పైస్థాయి అధికారులతో చర్చలు జరుపుతున్నామని ఆమె పేర్ొకన్నారు. హెచ్-1బీ, ఎల్-1 వీసాలకు సంబంధించిన ఆ బిల్లులను అలాగే ఆమోదించకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందన్నారు.
విదేశాంగ కార్యదర్శి, అమెరికా కాంగ్రెస్ సభ్యులతో సమావేశమయ్యారని, ప్రస్తుతం భయపడాల్సిన అవసరం లేదని ఆమె భరోసా ఇచ్చారు. తాము ఉద్యోగాలను దొంగిలించడం లేదని, అమెరికా ఆర్థిక వ్యవస్థకు సహకరిస్తున్నామని వారికి చెప్పామన్నారు
రాజ్యసభలో గురువారం జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో సుష్మా స్వరాజ్ ఈ విషయాలపై మాట్లాడారు. ట్రంప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమెరికా విధానాల్లో మార్పులు వస్తున్నాయని అనడం సరికాదని ఆమె పేర్కొన్నారు.
డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు కాకముందు నుంచీ హెచ్-1బీ వీసా పాలసీపై ఆందోళనలు ఉన్నాయని ఆమె చెప్పారు. 1990లో తొలిసారి ఈ వీసా బిల్లు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. అప్పుడు 65 వేల వీసాలు జారీ చేశారని తెలిపారు.
అనంతరం పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా 2000 సంవత్సరంలో ఈ వీసాల జారీని మూడింతలు అంటే 1,95,000 లకు పెంచారని, మళ్లీ 2004లో 65,000 లకు తగ్గించారని, ట్రంప్ ప్రెసిడెంట్ కాకముందు నుంచే దీనిపై ఆందోళనలు జరుగుతున్నట్లు దీనిని బట్టి స్పష్టమవుతోందని సుష్మా చెప్పారు.