నేనుండగా మమల్ని తాకలేరు.. మోడీ సర్కార్కు మమతా సవాల్
Array
కోల్కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మరోసారి కేంద్రంపై తీవ్రస్థాయిలో హెచ్చరికలు చేశారు. తాను ఉండగా పశ్చిమబెంగాల్ ప్రజలను ఎవరూ తాకలేరని ఆమె తేల్చి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం లోక్సభలో పౌరసత్వ సవరణ బిల్లును ప్రవేశపెట్టిన నేపథ్యంలో మమతా బెనర్జీ ఈ శ్యాఖ్యలు చేశారు.
ఎన్ఆర్సీ భయంతో ఆరుగురు మృతి: బెంగాల్లో ఎన్ఆర్సీ ఉండదన్న మమతా
నేనుండగా అది జరగదు..
పౌరసత్వ సవరణ బిల్లు(క్యాబ్), నేషనల్ రిజిస్ట్రేషన్ ఆఫ్ సిటిజెన్స్(ఎన్ఆర్సీ) ఏదైనా తానుంత కాలం పశ్చిమబెంగాల్ ప్రజలను ఎవరూ తాకలేరని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. టీఎంసీ అధికారంలో ఉండగా పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఎన్ఆర్సీ, క్యాబ్లను అనుమతించేది లేదని తేల్చిచెప్పారు. క్యాబ్, ఎన్ఆర్సీ అనేవి ఒక నాణేనికి రెండు వైపులని ఆమె వ్యాఖ్యానించారు.
ఆందోళన అవసరం లేదు..
‘ఎన్ఆర్సీ, క్యాబ్ల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బెంగాల్లో మేము అనుమతించేది లేదు. న్యాయబద్ధంగా ఉన్న పౌరులను దేశం నుంచి వెళ్లగొట్టడం లేదా వారిని శరణార్థులుగా మారుస్తున్నారు' మమతా బెనర్జీ ఆరోపించారు. ఇటీవల ఖరగ్పూర్లో జరిగిన ఉపఎన్నికల్లో టీఎంసీ విజయం సాధించిన నేపథ్యంలో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో ఆమె ఈ మేరకు వ్యాఖ్యానించారు.
పౌరసత్వ సవరణ బిల్లుకు ఆమోదం
కాగా, పౌరసత్వ సవరణ బిల్లు లోక్సభలో దుమారం రేపింది. బిల్లుకు కొన్ని సవరణలు చేసి సోమవారం హోంమంత్రి అమిత్ షా సభలో ప్రవేశపెట్టారు. బిల్లు ముస్లింలకు వ్యతిరేకం ఉందని విపక్షాలు అభ్యంతరం తెలిపాయి. సభలో గందరగోళం మధ్య బిల్లు ప్రవేశపెట్టేందుకు దిగువసభ ఆమోదం తెలిపింది. డివిజన్ పద్ధతిలో స్పీకర్ ఓం బిర్లా ఓటింగ్ నిర్వహించారు. బిల్లుకు అనుకూలంగా 293 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 82 మంది సభ్యులు ఓటేశారు. సభకు మొత్తం 375 మంది సభ్యులు హాజరయ్యారు.
విపక్షాల ఆందోళన
మైనార్టీలకు వ్యతిరేకంగా బిల్లు ఉందని విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. వ్యతిరేకంగా ఓటేయాలని తమ పార్టీ ఎంపీలకు టీఆర్ఎస్ పార్టీ విప్ జారీచేసింది. టీఎంసీ కూడా బిల్లును వ్యతిరేకించింది. పౌరసత్వ సవరణ బిల్లు సమానత్వపు హక్కుకు విరుద్ధమని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. బిల్లుతో ఇండియా ఇజ్రాయెల్గా మారుతోందని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ ఆందోళన వ్యక్తం చేశారు. బిల్లుపై హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. సభ నుంచి వాకౌట్ చేయొద్దని విపక్షాలకు సూచించారు. అన్నీ ప్రశ్నలకు సమాధానం చెబుతానని తెలిపారు.