వారిని ఎవరూ చంపలేదు, వాళ్లంత వాళ్లే చనిపోయారు: సోహ్రబుద్దీన్ కేసు తీర్పుపై రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: హరేన్ పాండ్యా, తులసీరామ్ ప్రజాపతి, జస్టిస్ లోయ, ప్రకాశ్ థోంబ్రే, శ్రీకాంత్ ఖండేల్కర్, కౌసర్ బి, సోహ్రబుద్దీన్ షేక్.. వీరిని ఎవరూ చంపలేదని, వారే చనిపోయారని ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ శనివారం నాడు ట్వీట్ చేశారు.
పదమూడేళ్లనాటి సొహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్ కేసు నిందితులందరూ నిర్దోషులేనని స్పెషల్ సీబీఐ కోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. దీనిపై రాహుల్ గాంధీ వ్యంగ్యస్త్రం విసిరారు.
సొహ్రాబుద్దీన్, అతడి ఎన్కౌంటర్ కేసుతో సంబంధమున్న వారిని ఎవరూ చంపలేదని వారే చనిపోయారని పేర్కొన్నారు. 'ఎవరూ చంపబడలేదు. హరేన్ పాండ్యా, తులసీరామ్ ప్రజాపతి, జస్టిస్ లోయా, ప్రకాశ్ తొంబ్రే, శ్రీకాంత్ ఖండాల్కర్, కౌసర్ బీ, సోహ్రాబుద్దీన్ షేక్.. వారికి వారే చనిపోయారు' అని ట్వీట్ చేశారు.
సొహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్ కేసులో 21మంది పోలీసు అధికారులు సహా మొత్తం 22 మందీ నిర్దోషులేనని ప్రత్యేక సీబీఐ న్యాయస్థానం శుక్రవారం తీర్పు వెలువరించింది. ఎన్నో మలుపులు తిరిగిన ఈ కేసులో మొత్తం 210 మంది సాక్షులను విచారించారు.
బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాను 2010లో అరెస్ట్ చేశారు. 2014 డిసెంబర్లో ఈ కేసు నుంచి ఆయన బయటపడ్డారు. ఈ కేసును విచారించిన సీబీఐ కోర్టు జడ్జి బీహెచ్ లోయా అనుమానాస్పదస్థితిల్లో మృతి చెందడం అనుమానాలకు తావిచ్చింది.