పాన్ కార్డు లేకుంటే... నగదు విత్ డ్రా కుదరదు: కేంద్రం తాజా ఝలక్
పాన్ నంబర్ లేదా ఫారం-60ని సమర్పించని వారు మార్చి 1 నుంచి అకౌంట్లలో డబ్బు ఉన్నప్పటికీ నగదు విత్ డ్రా చేసుకోలేరు.
న్యూఢిల్లీ: ఆదాయ పన్ను ఎగవేసేందుకు పలు మార్గాలు కనిపెట్టి ఇప్పటివరకు పన్ను చెల్లించకుండా తప్పించుకున్న బడా బాబులకు, పనిలో పనిగా మధ్యతరగతి ఆదాయ వర్గాలకు కేంద్ర ప్రభుత్వం తాజాగా పెద్ద ఝలక్ ఇచ్చింది.
నల్లధనానికి, పన్ను ఎగవేతకు వ్యతిరేకంగా మరో సమరానికి తెరలేపుతూ కేంద్రం తాజాగా పెను చర్య తీసుకుంది. దేశంలో బ్యాంకు ఖాతాలు కలిగిన ప్రతి వ్యక్తి ఇకపై తమ పాన్ నంబర్ తప్పనిసరిగా ఖాతాకు జోడించ వలసి ఉంటుంది.
పాన్ నంబర్ లేనివారు కనీసం ఫారం-60 అయినా బ్యాంకుకు సమర్పించాల్సి ఉంటుంది. దీనికి గడువు ఈ ఏడాది ఫిబ్రవరి 28. ఇలా చేయని వ్యక్తులు మార్చి 1 నుంచి వారి ఖాతాల్లో తగినంత నగదు నిల్వ ఉన్నప్పటికీ డబ్బు విత్ డ్రా చేసుకోలేరు.
దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆదివారం దేశంలోని అన్ని బ్యాంకులకు తమ ఖాతాదారుల నుంచి పాన్ నంబర్ లేదా ఫారం-60 తీసుకుని నమోదు చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేసింది.
పెద్దనోట్ల రద్దు తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య పన్ను ఎగవేత దారులందరికీ ముకుతాడు బిగించనుందని భావిస్తున్నారు. ఈ పాన్ నంబర్ నమోదుకు సంబంధించి ఆదాయపన్ను నిబంధనలను కూడా కేంద్రం సవరించింది. ఈ విషయమై ఆదివారం ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది.
అయితే జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ ఖాతాలతో కూడిన బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్స్ (బిఎస్ బిడిఎ) విషయంలో మాత్రం ఈ నిబంధన వర్తించదు. జన్ ధన్ ఖాతాలు కూడా దీంట్లో భాగమే. ఉచిత ఏటీఏం కార్డు, నెలవారీ స్టేట్ మెంట్, చెక్ బుక్ తో ప్రజల సాధారణ బ్యాంకింగ్ అవసరాలను తీర్చేందుకు ప్రవేశ పెట్టినవే ఈ బిఎస్ బిడిఎ ఖాతాలు.
పాన్ నంబర్ లేదా ఫారం-60ని సమర్పించని ఖాతాలు కలిగిన వారి అకౌంట్లలో తగినంత నగదు, డిపాజిట్లు ఉన్నప్పటికీ ఇలాంటి ఖాతాదారులు ఇకపై తమ ఖాతాల నుంచి నగదు విత్ డ్రా చేసుకోలేరని, డిపాజిట్లను వెనక్కి తీసుకోలేరని గత నెలలోనే రిజర్వు బ్యాంక్ స్పష్టం చేసింది.
అంతేకాకుండా, గత ఏడాది ఏప్రిల్ ౧ నుంచి నవంబర్ 8 వరకు ఖాతాదారులు చేసిన నగదు డిపాజిట్లకు సంబంధించిన సమాచారాన్ని కూడా తప్పకుండా సమర్పించాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి దేశంలోని అన్ని బ్యాంకులు, పోస్టాఫీసులను ఆదేశించింది.
పెద్ద నోట్ల రద్దు చేసిన తర్వాత 2016 నవంబర్ 9 నుఉంచి డిసెంబర్ 30 వరకు పరిమితిని మించి డిపాజిట్లు చేసిన వారి పూర్వ ఖాతాల నిర్వహణ చరిత్రను తెలుసుకోవడమే దీని ఉద్దేశమని భావిస్తున్నారు.