రాజ్యసభలో 'మహా' రగడ: గుజరాత్కు అల్లర్లు, జిగ్నేష్ ఉపన్యాసంపై నిషేధం
అహ్మదాబాద్/ముంబై: మహారాష్ట్రలో చోటు చేసుకున్న కుల దాడులు గుజరాత్కు కూడా పాకుతున్నాయి. రాజ్ కోట్ - సోమ్నాథ్ హైవేను మూసివేశారు. మరోవైపు, కులదాడులపై అత్యున్నత స్థాయి విచారణ జరిపించాలని రాజ్యసభలో విపక్షాలు పట్టుబట్టాయి.
ఇదిలా ఉండగా, రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారంటూ జిగ్నేష్ మేవానీ ఉపన్యాసాన్ని పోలీసులు నిషేధించారు. ఆల్ ఇండియా స్టూడెంట్ సమ్మిట్ రద్దయింది. ఈ ఈవెంట్కు ఉమర్ ఖలీద్, మేవానిని రానివ్వమని చెప్పారు. బుధవారం మహారాష్ట్రలో నిర్వహించిన బంద్ హింసాత్మకంగా మారింది.
భీమా - కోరెగావ్ యుద్ధం జరిగి 200 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో అల్లర్లు చెలరేగి ఒక యువకుడు ప్రాణాలు కోల్పోవడంతో మూడు రోజులుగా ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయి.
వీటిని అదుపు చేయడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిందిస్తూ ఇచ్చిన పిలుపుమేరకు రాష్ట్రంలో బంద్ పాటించారు. అనేకచోట్ల రైళ్లు, వాహనాల రాకపోకలకు అంతరాయం వాటిల్లింది. సిటీ బస్సులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. సబర్బన్ రైళ్లను అడ్డుకున్నారు. థానే, ఘాట్కోపర్, విఖ్రోలీ తదితర స్టేషన్లలో జరిగిన నిరసనల కారణంగా అనేక రైళ్లు గంటలతరబడి పట్టాలపైనే నిలిచిపోయాయి.
పెద్దఎత్తున ఆందోళనకారులు పట్టాలపైనే తిష్టవేశారు. అనేకచోట్ల రహదారులపై అడ్డంకులు కల్పించారు. పశ్చిమ ఎక్స్ప్రెస్ హైవేపై అవరోధం కలిగించడానికి ప్రయత్నించిన వందలాది మందిని పోలీసులు చెదరగొట్టారు.
ముంబైలో అనేక ప్రాంతాల్లో వాహనాలను దారి మళ్లించారు. వివిధ ఘటనల్లో 13 బస్సులు ధ్వంసమయ్యాయి. డబ్బావాలాలు తమ సేవల్ని నిలిపేశారు. హింస జరగవచ్చనే భయంతో అనేకమంది ఇళ్ల నుంచి బయటకే రాకపోవడంతో కార్యాలయాల్లో హాజరు తగ్గింది.