ప్రభుత్వ ప్రకటనల్లో మంత్రులు, రాజకీయ నేతల ఫొటోలొద్దు: సుప్రీం
న్యూఢిల్లీ: ప్రభుత్వ ప్రకటనలపై సుప్రీంకోర్టు బుధవారం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రభుత్వం జారీ చేసే ప్రకటనల్లో మంత్రులతోపాటు రాజకీయ నేతల ఫొటోలు ఉపయోగించొద్దని పేర్కొంది. ఇది వ్యక్తిగత ప్రచారాన్ని ప్రోత్సహించే విధంగా ఉందని తెలిపింది.
ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థలు జారీ చేసే ప్రకటనల్లో కేవలం రాష్ట్రపతి, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, మహాత్మా గాంధీ లాంటి దివంగత జాతీయ నేతల ఫొటోలను ఉపయోగించవచ్చని జస్టిస్ రంజన్ గోగొయ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ తన తీర్పులో తెలిపింది.
మంత్రులు, రాజకీయ నేతల ఫొటోలను ప్రభుత్వ ప్రకటనల్లో ఉపయోగించరాదని పేర్కొంది. ఇది వ్యక్తిగత ప్రచారాన్ని ప్రోత్సహించే సంప్రదాయానికి దారితీస్తుందని తెలిపింది.
హోర్డింగులు, ప్రకటనల వల్ల ప్రజా ధనం వృథా అవుతుందని దాఖలైన రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను విచారించిన అనంతరం కోర్టు ఈ మేరకు తాజా మార్గదర్శకాలను జారీ చేసింది. ఇలాంటి ఘటనలు భవిష్యత్లో జరిగితే, వాటిని దుర్వినియోగంగా పరిగణించడం జరుగుతుందని పేర్కొంది.