సంక్షోభం సమసింది: కాంగ్రెస్లోనే సచిన్ పైలట్, ఇక జాతీయస్థాయిలో కీలక పాత్ర
జైపూర్: రాజస్థాన్ రాష్ట్ర రాజకీయాల్లో గత కొంత కాలంగా నెలకొన్న సంక్షోభం ముగిసింది. సీఎం అశోక్ గెహ్లాట్ తీరుపై అసంతృప్తితో సొంత పార్టీపై తిరుగుబావుటా ఎగురవేసిన సచిన్ పైలట్ తిరిగి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ అగ్రనేతలు చర్చలు జరిపారు.
రాహుల్ సహా నేతలతో సచిన్ పైలట్ చర్చలు
కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్లో సచిన్ పైలట్, తనకు మద్దతుగా వచ్చిన ఎమ్మెల్యేలతోపాటు పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, అహ్మద్ పటేల్తో చర్చలు జరిపారు. ఈ చర్చలు సజావుగా, సానుకూలంగా జరిగాయి. దీంతో తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని సచిన్ పైలట్ స్పష్టం చేశారు.
సోనియా ఆదేశాలతో కమిటీ.. స్వాగతించిన పైలట్
మరోవైపు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆదేశాల మేరకు రాజస్థాన్ రాజకీయ పరిస్థితులపై సమీక్షించేందుకు త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ప్రియాంక గాంధీ, అహ్మద్ పటేల్, కేసీ వేణుగోపాల్ ఉన్నారు. ఈ త్రిసభ్య కమిటినీ ఏర్పాటు చేయడం పట్ల సచిన్ పైలట్ సంతృప్తి వ్యక్తం చేశారు. తనకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు.
స్వప్రయోజనాలకు స్థానం లేదు..
రాజకీయాల్లో స్వప్రయోజనాలకు స్థానం లేదని ఈ సందర్భంగా పైలట్ స్పష్టం చేశారు. అయితే, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్తో విభేదాల నేపథ్యంలో సచిన్ పైలట్ సేవలను దేశ వ్యాప్తంగా వినియోగించుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో సచిన్ పైలట్ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
Recommended Video
బలనిరూపణపై ఉత్కంఠకు తెర
అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంపై అసంతృప్తితో 18 మంది ఎమ్మెల్యేలతో కలిసి సచిన్ పైలట్ తిరుగుబావుటా ఎగురవేయడంతో రాజస్థాన్ రాష్ట్రంలో సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సచిన్ పైలట్ తోపాటు రెబల్ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ పార్టీ వేటు వేసింది. అయితే, సచిన్ పైలట్ లాంటి సీనియర్ నేతను వదులుకోవడం ఇష్టంలేని కాంగ్రెస్.. ఆయనకు ఎప్పుడూ తలుపులు తెరిచే ఉంటాయని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే చర్చల ద్వారా సంక్షోభం సమసిపోయినట్లు తెలుస్తోంది. దీంతో ఆగస్టు 14న జరిగే బలనిరూపణ పరీక్షపై ఉత్కంఠకు తెరపడినట్లయింది.