లష్కరే తోయిబా-కాంగ్రెస్ ఒక్కటేనా: సైన్యంపై కాంగ్రెస్ నేత దారుణ వ్యాఖ్యలకు అమిత్ షా కౌంటర్
శ్రీనగర్: జమ్ము, లడక్ అభివృద్ధిని పీడీపీ పూర్తిగా విస్మరించిందని, అందుకే తాము పొత్తును తెంచుకున్నామని బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా శనివారం వెల్లడించారు. పొత్తు తెగిపోయాక ఆయన రాష్ట్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా మాజీ సీఎం మెహబూబా ముఫ్తీపై మండిపడ్డారు. ఆమె పాలనలో హిందువులు అత్యధికంగా ఉన్న జమ్మూ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు.
అంతేగాక, కాశ్మీర్ అభివృద్ధి కోసం కేంద్రం రాష్ట్రానికి 80 వేల కోట్ల రూపాయలు ఇవ్వగా ఆ డబ్బు జమ్మూ, లడఖ్లకు చేరలేదన్నారు. దీంతో ఆ రెండు ప్రాంతాలు అభివృద్ధిలో వెనుకబడిపోయాయన్నారు. అభివృద్ధిలో సమన్యాయం లేకపోవడం వల్లే తాము పీడీపీతో బంధం తెంచుకున్నామన్నారు. బీజేపీ అధికారం కోసం పాకులాడదని తాము అభివృద్ధిని మాత్రమే కోరుకుంటుందన్నారు.
జమ్ము కాశ్మీర్లో ఎయిమ్స్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదముద్ర వేసిందని అమిత్ షా తెలిపారు. కానీ ఇందుకు జమ్మూ ప్రాంతంలో పీడీపీ ప్రభుత్వం భూమిని కేటాయించలేదన్నారు. ప్రధాని మోడీ హయాంలోనే ఎక్కువ మంది ఉగ్రవాదులు హతమయ్యారని, హతమవుతారన్నారు. సైన్యంపై తమకు నమ్మకం ఉందన్నారు. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఆపరేషన్స్ చేసేందుకు రాష్ట్రంలో గవర్నర్ పాలన విదించారని మీడియా అభూత కల్పనలు వండి వారుస్తోందన్నారు.
ఉగ్రసంస్థ లష్కరే తోయిబా (ఎల్ఈటీ), కాంగ్రెస్ ఒకే తాటిపై ఉన్నాయా అంటూ అమిత్ ప్రశ్నించారు. దీనికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలన్నారు. ఇటీవల కాంగ్రెస్ నాయకులు గులాం నబీ ఆజాద్, సైఫుద్దీన్ సోజ్ చేసిన వ్యాఖ్యలను ఎల్ఈటీ సమర్థించిన నేపథ్యంలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు.
కాశ్మీర్లో సైన్యం ఉగ్రవాదుల కన్నా పౌరులనే ఎక్కువగా బలి తీసుకుందని ఆజాద్ వ్యాఖ్యానించగా, కాశ్మీరీలు స్వాతంత్య్రాన్ని కోరుకుంటారని సోజ్ ఇటీవల అన్నారు. వీటిని ఎల్ఈటీ సమర్థించింది. ఈ వ్యాఖ్యలపై అమిత్ షా గట్టి కౌంటర్ ఇచ్చారు. జన్ సంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ ప్రసాద్ ముఖర్జీ కృషి వల్లే కాశ్మీర్ దేశంలో భాగంగా ఉందని షా అన్నారు. ముఖర్జీ వర్ధంతి సందర్భంగా శనివారం జమ్ములో జరిగిన ర్యాలీలో ఈ వ్యాఖ్యలు చేశారు.
కాశ్మీర్ రిపోర్టర్లపై బీజేపీ నేత అసనహం
కాశ్మీర్ రిపోర్లపై బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చౌదరి లాల్సింగ్ అసహనం వ్యక్తం చేశారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ కథువా అత్యాచారం కేసును ప్రస్తావించారు. ఈ కేసులో నిందితులకు మద్దతుగా ఆయన ఆందోళన చేయడంతో పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. దానిని దృష్టిలో పెట్టుకొని... కాశ్మీర్ పాత్రికేయులు ఓ తప్పుడు వాతావరణాన్ని సృష్టించారని, మీరు చేసే పనికి పరిమితులు విధించుకోండని, రైజింగ్ స్టార్ పత్రిక సంపాదకుడు షుజాత్ బుఖారీకి ఏమి జరిగిందో గుర్తించుకొండని, జాగ్రత్తపడండని, సోదరభావం చెడిపోకుండా పరిమితులు పెట్టుకోండని, అప్పుడే రాష్ట్ర ప్రగతి సాధ్యమవుతుందన్నారు. ఈ సంఘటనపై తప్పుడు ప్రచారం జరగడం వల్లనే రాజీనామా చేయాల్సి వచ్చిందన్నారు.