65ఏళ్లు పైబడిన వారికి ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్కు ‘నో’ చెప్పిన ఈసీ
న్యూఢిల్లీ/పాట్నా: రానున్న బీహార్ ఎన్నికల నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్పై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. త్వరలో జరగనున్న బీహార్ ఎన్నికల్లో గానీ, ఇతర ఏ ఎన్నికల్లో గానీ ప్రస్తుతానికి 65 ఏళ్లు పైబడిన వ్యక్తులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించడం లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
పోస్టల్ బ్యాలెట్ అమలు విషయంలో ఎదురవుతున్న కొన్ని అడ్డంకులు, సవాళ్ల నేపథ్యంలోనే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ తెలిపింది. కాగా, రానున్న బీహార్ ఎన్నికలు, మధ్యప్రదేశ్ 24 అసెంబ్లీ స్థానాలకు జరిగే ఎన్నికల నేపథ్యంలో 65ఏళ్ల పైబడిన వారికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాలని మొదట ఈసీ భావించింది.
అయితే, 80ఏళ్లు పైబడిన వారికి మాత్రమే కల్పిస్తున్న పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని 65ఏళ్లు పైబడిన వారికి కూడా వర్తింపజేయాలని నిర్ణయించింది. తాజాగా, తన నిర్ణయాన్ని ఎన్నికల సంఘం మార్చుకుంది. కరోనా వచ్చినవారు కూడా ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది ఈసీ.
ఈ ఏడాది నవంబర్ 26తో బీహార్ అసెంబ్లీ కాలపరిమితి ముగియనున్న నేపథ్యంలో అక్కడ ఎన్నికలు ఆలోపే జరపాల్సి ఉంది. కాగా, కరోనా వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో మరోసారి లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే.
Recommended Video
బీహార్ రాష్ట్రంలో ఇప్పటి వరకు 21,558 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 7,290 యాక్టివ్ కేసులున్నాయి. 14,101 మంది కోలుకున్నారు. కరోనాతో 167 మంది మరణించారు.