దర్యాఫ్తు లేదు: ఫ్లిప్కార్ట్ ‘బిగ్ బిలియన్ డే' సీతారామన్
న్యూఢిల్లీ: ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్డ్ బిగ్ బిలియన్ డే డిస్కౌంట్ ఆపర్లపై వచ్చిన ఫిర్యాదులపై ఎలాంటి విచారణ జరపడంలేదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఢిల్లీలోని ఆమె విలేకరులతో మాట్లాడారు. ఫ్లిప్కార్ట్ పైన ఎలాంటి ప్రణాళికాబద్ధమైన దర్యాప్తు ఉండదని తెలిపారు.
ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ ‘ఫ్లిప్కార్ట్' దసరా పండగ నేపథ్యంలో ప్రవేశపెట్టిన డిస్కౌంట్ అమ్మకాలపై కేంద్ర ప్రభుత్వానికి పలు ఫిర్యాదులు అందినట్లు కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పది రోజుల క్రితం తెలిపారు. చాలామంది ఆందోళన వ్యక్తం చేశారని, దీనిపై తప్పకుండా పరిశీలిస్తామని చెప్పారు.
ప్రస్తుతం ఈ విషయంపై అధ్యయనం చేస్తున్నామని ఒక వేళ ప్రత్యేక విధానం లేక ఈ-కామర్స్ రిటైల్ వ్యాపారంపై స్పష్టత అవసరమా? అన్న కోణంలో కూడా ఆలోచిస్తున్నామని అన్నారు. త్వరలోనే దీనిపై ఓ ప్రకటన చేయనున్నట్లు తెలిపారు.
కాగా, ‘బిగ్ బిలియన్ డే' స్కీం పేరుతో ఫ్లిప్ కార్ట్ ఇటీవల ఇచ్చిన ఆఫర్ డిస్కౌంట్కు 1.5 మిలియన్ల మంది తమ పోర్టల్లో షాపింగ్ చేశారని, పది గంటల్లో రూ. 600 కోట్లకు పైగా ఉత్పత్తులు అమ్ముడయ్యాయని సదరు సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే.
అంతేగాక బిగ్ బిలియన్ డే ద్వారా వినియోగదారులను సంతృప్తి పరచడంలో విఫలమయ్యామని, అనుకున్నస్థాయిలో పని తీరును కనబర్చలేకపోయామని ప్లిఫ్కార్డ్ అంగీకరించింది. ఇందుకుగాను ప్రతి ఒక్క వినియోగదారుడికి క్షమాపణ చెబుతున్నట్లు తెలిపింది. మరోసారి ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించదలిస్తే పూర్తి సన్నద్దతతో చేస్తామని హామీ ఇచ్చింది.
ఇదిలా ఉండగా.. ది బిగ్ బిలియన్ డే సేల్ పేరుతో పెట్టిన ఆఫర్ల నేపథ్యంలో ఈ-కామర్స్ జెయింట్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ను వివరణ కోరుతూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసు పంపించినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సంస్థకు ఈడీ రూ.1,000 కోట్ల వరకు జరిమానా విధించవచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ విషయమై తాము ఎలాంటి విచారణ చేయడం లేదని వివరణ కూడా ఇచ్చారు.