మళ్లీ మొదటికి.. పళనితో శశికళనే నడిపిస్తోంది: పన్నీరు వర్గం సంచలనం
అన్నాడీఎంకేలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. నిమిషానికో ట్విస్ట్ కనిపిస్తోంది. నిన్నటి దాకా పార్టీలోని రెండు గ్రూపుల విలీనం ఖాయంగా కనిపించింది. కానీ ఆ తర్వాత అనూహ్య మలుపు చోటు చేసుకుంది. విలీనం అంశం ఇ
చెన్నై: అన్నాడీఎంకేలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. నిమిషానికో ట్విస్ట్ కనిపిస్తోంది. నిన్నటి దాకా పార్టీలోని రెండు గ్రూపుల విలీనం ఖాయంగా కనిపించింది. కానీ ఆ తర్వాత అనూహ్య మలుపు చోటు చేసుకుంది. విలీనం అంశం ఇప్పుడు మళ్లీ వెనక్కి నడుస్తున్నట్లుగా కనిపిస్తోంది.
కొత్త ట్విస్ట్: తమిళనాడు సీఎంగా పన్నీరుసెల్వం, పళనికి డిప్యూటీ..?
తాజాగా, అన్నాడీఎంకేలోని పన్నీరుసెల్వం వర్గం నేత మునుస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి పళనిస్వామి వర్గం చేస్తున్న వ్యాఖ్యలు ఎన్నో అనుమానాలకు తావిస్తోందని సందేహాలు వ్యక్తం చేశారు. అలా అయితే విలీనం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. మొత్తానికి విలీన ప్రక్రియ విఫలమైనట్లుగా కనిపిస్తోంది. తమ అన్ని డిమాండ్లు నెరవేరుస్తేనే చర్చలు ముందుకు వెళ్తాయని అంటున్నారు.
అనుమానాలు ఉన్నాయి
తాము శశికళను, దినకరన్లను పార్టీ నుంచి వెళ్లగొట్టాలని చూస్తున్నామని చెప్పారు. కానీ శశికళనే ఈ వ్యవహారమంతటినీ వెనుక ఉండి నడిపిస్తున్నట్లుగా కనిపిస్తోందని అనుమానాలు వ్యక్తం చేశారు. పళని వర్గం నేతల వ్యాఖ్యలు చూస్తుంటే అలాగే కనిపిస్తోందన్నారు.
అప్పుడే నమ్మకం
శశికళను, దినకరన్ను పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు పళనిస్వామి వర్గం అధికారికంగా ప్రకటన చేయాలన్నారు. అప్పుడే కొంత నమ్మకం ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు.
జయ మృతిపై విచారణ
అలాగే, జయలలిత మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని మునుస్వామి డిమాండ్ చేశారు. అమ్మ మృతి విచారణ కూడా తాము పళనిస్వామి వర్గం ముందు పెట్టిన ప్రధాన డిమాండు అని చెప్పారు.
దీనిని తాము మరోసారి లేవనెత్తుతున్నామని చెప్పారు. అమ్మ మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని తాము డిమాండ్ చేస్తున్నామని చెప్పారు.
రాజీనామా చేయాల్సిందే
శశికళ, దినకరన్ను పార్టీ నుంచి అధికారంగా బహిష్కరిస్తేనే ఇరువర్గాల విలీనం సాధ్యమవుతుందని, వారు అధికారికంగా రాజీనామా చేయాలని మునుస్వామి తేల్చి చెప్పారు. బెంగళూరు జైలులో ఉన్న శశికళయే ఈ వ్యవహారాన్ని నడిపించడం తమకు ఇష్టం లేదన్నారు.
పన్నీరునే కోరుకుంటున్నారు
కోటిన్నర మంది అన్నాడీఎంకే కార్యకర్తలు మాజీ ముఖ్యమంత్రి పన్నీరుసెల్వంను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉండాలని కోరుకుంటున్నారని మునుస్వామి చెప్పారు. తాము మొదటి నుంచి పెట్టిన డిమాండ్లనే మళ్లీ మళ్లీ చెబుతున్నామన్నారు.